కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-01-25T19:35:29+05:30 IST

కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ

హైదరాబాద్: కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. కరోనా కట్టడి చర్యలపై డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక అందజేశారు. అయితే ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదించారు. మాస్కులు, భౌతికదూరం అమలు కాకపోవడం దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ, పోలీసులు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పరిస్థితి వివరించేందుకు తదుపరి విచారణకు హాజరు కావాలని డీహెచ్‌ శ్రీనివాసరావును హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.


డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక

రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవని, పాజిటివిటీ 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అవసరమని డీహెచ్ పేర్కొన్నారు. గత వారంలో ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10శాతం లేదన్నారు. మెదక్‌లో అత్యధికంగా 6.45, జీహెచ్ఎంసీలో 4.26, మేడ్చల్‌లో 4.22 శాతం పాజిటివిటీ ఉందని వివరించారు. ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1శాతంగా ఉందని, ముందు జాగ్రత్త చర్యగా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతోందని డీహెచ్ శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు.

Updated Date - 2022-01-25T19:35:29+05:30 IST