తెలంగాణది తప్పుడు ప్రచారమే
ABN , First Publish Date - 2021-12-09T07:24:43+05:30 IST
బియ్యం సేకరణలో తెలంగాణ సర్కారు పదేపదే తప్పుడు ప్రచారం చేస్తోందని
- రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ..
- నాలుగైదు సార్లు సమయమిచ్చాం.. అయినా ఉప్పుడు బియ్యం ఇవ్వట్లేదు
- లోక్సభలో పీయూష్ గోయెల్ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): బియ్యం సేకరణలో తెలంగాణ సర్కారు పదేపదే తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎఫ్సీఐ తెలంగాణ నుంచి రికార్డు స్థాయిలో బియ్యాన్ని సేకరించేందుకు ఆమోదం తెలిపినా తమకు అన్యాయం జరుగుతోందంటూ రాష్ట్రప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని చెప్పారు. తెలంగాణ వికేంద్రీకృత సేకరణ రాష్ట్రం అయినందున ఎఫ్సీఐ నేరుగా ధాన్యం సేకరించదని, రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి బియ్యంగా మార్చి ఇస్తుందని తెలిపారు. కేంద్రానికి అధిక బియ్యం ఇచ్చేందుకు వీలుగా తాము రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగైదు సార్లు సమయాన్ని పొడిగించామన్నారు. పెద్ద ఎత్తున అనుమతులు కూడా ఇచ్చామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనుగోలులో విఫలమవుతోందని, అలా చెప్పడానికి తనకు బాధగా ఉందన్నారు. అయినా ఈ బియ్యాన్ని సేకరించేందుకు ఎఫ్సీఐ సిద్ధంగా ఉంద ని, తాము సమయాన్ని పొడిగించామని గోయల్ చెప్పా రు.
తెలంగాణ నుంచి ఎంత వేగంగా బియ్యం వస్తే ఎఫ్సీఐ కూడా అంతే వేగంగా కొనుగోలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే ఎంత బియ్యం సేకరించాలో ఎఫ్సీఐ నిర్ణయిస్తుందని కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి చెప్పారు. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే అదనపు బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా తెలంగాణ కేంద్ర పూల్కు మళ్లిస్తుందని ఆమె వివరించారు. తెలంగాణపై ఎలాంటి వివక్షా చూపలేదని చెప్పారు.
రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు: ఉత్తమ్
బియ్యం సేకరణలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం కావడంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఉత్తమ్ అన్నారు. వరి పండించే రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ నుంచి కొనుగోలు చేస్తామన్న బియ్యంలో ఎఫ్సీఐ ఇప్పటి వరకు సగం కూడా సేకరించలేదని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్నారు.
ఖరీఫ్ సీజన్లో తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని ఆగస్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోగా.. ఇప్పటి వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి సరిపడా ధాన్యాన్నే సేకరించారని తెలిపారు. ప్రతి గింజా కొంటామన్న సీఎం కేసీఆర్ ఇంకా గోనె సంచులను కూడా కొనలేదన్నారు. కల్లాలకు వచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పా రు. తెలంగాణలో మొత్తం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలన్నా రూ.10 వేల కోట్ల కంటే తక్కువ ఖర్చవుతుందని తెలిపారు.
‘ధాన్యం కొనం.. బియ్యమే కొంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో చెప్పారు. ఇది చాలా ఆశ్చర్యకరం. నాకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మాత్రం ఇప్పటి వరకు రాష్ట్రంలో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని తెలిపారు’’ అని ఉత్తమ్ చెప్పారు. పంజాబ్, హరియాణాల్లో నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఎఫ్సీఐ.. తెలంగాణలో ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. మిల్లింగ్ సామర్థ్యం లేదని టీఆర్ఎస్ ఎంపీలు అబద్ధమాడుతున్నారని, రాష్ట్రంలో నెలకు కోటి మెట్రిక్ టన్నుల మిల్లింగ్ సామర్థ్యం ఉందన్నారు.