తెలంగాణలో మరో అద్భుత ఘట్టం..

ABN , First Publish Date - 2020-05-28T21:24:37+05:30 IST

తెలంగాణలో మరో అద్భుత ఘట్టం సాక్షాత్కరించబోతోంది.

తెలంగాణలో మరో అద్భుత ఘట్టం..

హైదరాబాద్‌: తెలంగాణలో మరో అద్భుత ఘట్టం సాక్షాత్కరించబోతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రెండో అతిపెద్ద జలాశయం కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కొండపోచమ్మ సాగర్ రూ. 16 వందల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలు కొండపోచమ్మ సాగర్‌ను 8 కి.మీ. మేర వలయాకారంలో నిర్మించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మూడు చోట్ల నీటిని పంపించేలా పంప్ హౌస్‌లు నిర్మించారు. ఈ రిజర్వాయర్ ద్వారా 5 జిల్లాల పరిధిలో 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. గజ్వేల్ నియోజకవర్గంలో 26వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇదే రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ నగరానికి కూడా తాగు నీరు సరఫరా చేయనున్నారు.


కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ యాగాలు చేయనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఏకకాలంలో యాగాలు చేస్తారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో ఛండీయాగం, సుదర్శనయాగం, గంగమ్మ పూజలు చేస్తారు. ఛండీయాగం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్‌ను కేసీఆర్ దంపతులు ప్రారంభిస్తారు. అలాగే ఎర్రవల్లి మర్కూరులో రైతు వేదికలకు ఆయన శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


Updated Date - 2020-05-28T21:24:37+05:30 IST