తెలంగాణ ఐటీ మంత్రి సెక్రటరీ పేరుతో మోసానికి యత్నం
ABN , First Publish Date - 2020-11-13T12:32:38+05:30 IST
ఐటీశాఖ మంత్రి కార్యదర్శిగా చెప్పుకున్నాడు.. కాలుష్య మండలి మీ కంపెనీ మూసేందుకు
హైదరాబాద్ /బంజారాహిల్స్ : ఐటీశాఖ మంత్రి కార్యదర్శిగా చెప్పుకున్నాడు.. కాలుష్య మండలి మీ కంపెనీ మూసేందుకు నోటీసు ఇచ్చిందని నమ్మించాడు. సీజ్ను ఆపేందుకు రూ. 15 లక్షలు ఖర్చు అవుతుందని నమ్మబలికాడు. అతడి మాటలపై నమ్మకం కుదరక కంపెనీ నిర్వాహకులు వాకబు చేయగా మోసం అని తేలింది. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలో వివిన్ డ్రగ్స్, ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ పేరిట ఔషధాల తయారీ కంపెనీ ఉంది. జూబ్లీహిల్స్ నుంచి కంపెనీ కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఈ నెల 6న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన ఓ సమావేశానికి కంపెనీ డీజీఎం మురళీమోహన్ హాజరయ్యారు. మరుసటి రోజు ఆయనకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఐటీ శాఖ మంత్రి కార్యదర్శి తిరుపతిరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు.
కాలుష్య నియంత్రణ మండలి మీ కంపెనీని మూసేసేం దుకు తుది నోటీసు సిద్ధం చేసిందని, దాన్ని ఆపాలంటే మండలిలో ముగ్గురు సభ్యులకు రూ.15లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందు కోసం మూడు బ్యాంకు ఖాతా నెంబర్లు ఇచ్చాడు. మురళీమోహన్ తనిఖీ చేయగా శ్రీకాకుళం నర్సన్నపేటలోని నాగరాజు అనే వ్యక్తి పేరున ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన ఖాతాలుగా గుర్తించారు. దీంతో అతడు జూ బ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేస్తున్నారు.