మా తల్లి ఏమైందో చెప్పండి..?
ABN , First Publish Date - 2021-05-17T05:01:27+05:30 IST
మా తల్లి ఏమైంది? అసలు బతికుందా లేదా? ఒక వేళ చనిపోయి ఉంటే ఆమె మృతదేహాన్ని తమకు అప్పగించాలని చిత్తూరు నగరంలోని కన్నయ్య నాయుడు కాలనీకి చెందిన సుల్తాన్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
చిత్తూరు (సెంట్రల్), మే 16: మా తల్లి ఏమైంది? అసలు బతికుందా లేదా? ఒక వేళ చనిపోయి ఉంటే ఆమె మృతదేహాన్ని తమకు అప్పగించాలని చిత్తూరు నగరంలోని కన్నయ్య నాయుడు కాలనీకి చెందిన సుల్తాన్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ తమ తల్లి నూర్జహాన్కు జ్వరం రావడంతో ఈనెల 10వ తేదీన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లామన్నారు. అక్కడి సిబ్బంది కేవలం 15 నిమిషాలు ఆక్సిజన్ అందించి ఆర్వీఎస్ ఆస్పత్రికి తీసుకుపోవాలని సూచించారని చెప్పారు. ఆర్వీఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లినా అక్కడ పరిస్థితి సరిగాలేకపోవడంతో 11న చిత్తూరు ఆస్పత్రికి తీసుకొచ్చి కొవిడ్ వార్డులో ఆడ్మిట్ చేశామన్నారు. అప్పటి నుంచి డాక్టర్లు, సిబ్బంది తమ తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్ రోజున ఆస్పత్రికి వెళ్లి వివరాలు అడిగినా చెప్పలేదన్నారు. తెలిసిన వ్యక్తుల ద్వారా వాకబు చేయగా, తమ తల్లి మృత్యువాతపడి నాలుగు రోజులు గడిచిందని చెప్పారని కంటతడి పెట్టారు. ఆస్పత్రి సిబ్బంది తమ తల్లి అవయవాలు అమ్మేసారని సుల్తాన్తో పాటు బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తన తల్లి వివరాలు చెప్పాలని, చనిపోయి ఉంటే మృతదేహాన్ని అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.