పెద్ద మనసు చాటిన తెలుగు ఎన్నారై.. ప్రవాసుల కోసం ప్రత్యేక విమానం
ABN , First Publish Date - 2020-06-30T17:17:23+05:30 IST
కరోనా లాక్డౌన్ కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారత ప్రవాసుల కోసం వాషింగ్టన్కు చెందిన పారిశ్రామికవేత్త, తెలుగు ఎన్నారై రవి పులి ప్రత్యేకంగా ఓ చార్టెడ్ విమానం ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటారు.
యూఎస్లో చిక్కుకున్న భారత ప్రవాసుల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు
చార్టెడ్ విమానంలో స్వదేశానికి చేరుకున్న 250 మంది ఎన్నారైలు
హైదరాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారత ప్రవాసుల కోసం వాషింగ్టన్కు చెందిన పారిశ్రామికవేత్త, తెలుగు ఎన్నారై రవి పులి ప్రత్యేకంగా ఓ చార్టెడ్ విమానం ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటారు. యూఎస్లోని వివిధ నగరాల నుంచి 250 మంది ప్రయాణికులను ఈ విమానం ఈ నెల 26న శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చింది. అమెరికాలోని చాలా మంది ఎన్నారైలు లాక్డౌన్ కారణంగా వారి వీసా గడువు ముగియడం ద్వారా ‘అక్రమ వలసదారులు’ అయ్యే ప్రమాదం ఉందని పులికి తెలిసింది. దాంతో వెంటనే ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారిని స్వదేశానికి తరలించారు.
ఇక ఆయన... ‘యూఎస్ ఇండియా సాలిడారిటీ మిషన్(యూఎస్ఐఎస్ఎం)’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి కరోనా కష్టకాలంలో విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసులను స్వదేశానికి తరలించేందుకు తన వంతు సాయం చేస్తున్నారు. అటు ఖతార్లో చిక్కుకున్న భారత ప్రవాసులను కూడా స్వదేశానికి తరలించేందుకు ఇప్పటికే దోహా, హైదరాబాద్ విమానాశ్రయ అధికారులు... ఇరుదేశాల ఎంబసీల నుంచి అనుమతి పొందినట్లు పులి పేర్కొన్నారు. రాబోయే మూడు వారాల్లో యూఎస్తో పాటు ఖతార్లోని భారత ప్రవాసుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పులి ఈ విమానాలను ఏర్పాటు చేయడంలో తనకు సహకరించినందుకు వాషింగ్టన్, ఖతార్లోని భారత రాయబార కార్యాలయానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు భారతదేశం, తెలంగాణ ప్రభుత్వాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.