ట్రంప్ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుగు వైద్యుడు
ABN , First Publish Date - 2020-08-07T05:21:11+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవైపు కరోనా వ్యాప్తి నిరోధానికి, దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ఎన్నికల పనిలో నిమగ్నమయ్యారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా ట్రంప్ టెక్సాస్లోని ఒడెస్సాకు వచ్చారు.
ఒడెస్సా, టెక్సాస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవైపు కరోనా వ్యాప్తి నిరోధానికి, దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ఎన్నికల పనిలో నిమగ్నమయ్యారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా ట్రంప్ టెక్సాస్లోని ఒడెస్సాకు వచ్చారు. ఇదే సమయంలో నిధుల సేకరణ కార్యక్రమం కోసం ట్రంప్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలుగువారు, టెక్సాస్లో ఉంటున్న డాక్టర్ జయరాం నాయుడుకు కూడా ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా దేశ అధ్యక్షుడితో భేటీ అయి, అరగంటసేపు వివిధ అంశాలపై డాక్టర్ జయరాం నాయుడు చర్చించారు. ట్రంప్తో భేటీ పట్ల జయరాం నాయుడు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో హెచ్1బీ వీసాలపై ఉన్న అర్హత కలిగిన ఫిజీషియన్స్కు గ్రీన్ కార్డు ఇచ్చే అంశాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ట్రంప్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అర్హత కలిగిన వారికి అండగా ఉంటామని, మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ పట్ల పాజిటివ్గా ఉన్నట్లు తెలిపారు. ‘అమెరికన్లకే ఉద్యోగాలు’ అన్న నినాదంతో ట్రంప్ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆ దిశగా పలు అడుగులు వేశారు. ఇక ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి, ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా విదేశీయులకు షాకిచ్చే ఎన్నో చర్యలు తీసుకున్నారు ట్రంప్. అయితే మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్పై మాత్రం ఆయన హామీ ఇస్తున్నారు.