సౌతాఫ్రికాలో తెలుగు యువ‌కుడు మృతి..!

ABN , First Publish Date - 2020-05-28T18:50:51+05:30 IST

ఉన్న‌త చ‌దువులు చ‌దివి మంచి ఉద్యోగం కోసం సౌతాప్రికా వెళ్లిన తెలుగు యువ‌కుడు అనారోగ్యంతో మృతి చెందాడు.

సౌతాఫ్రికాలో తెలుగు యువ‌కుడు మృతి..!

‌భద్రాద్రి కొత్తగూడెం: ఉన్న‌త చ‌దువులు చ‌దివి మంచి ఉద్యోగం కోసం సౌతాప్రికా వెళ్లిన తెలుగు యువ‌కుడు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడు హర్షవర్ధన్‌ రెడ్డి(27) స్వ‌స్థ‌లం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరారూరల్ మండల పరిధిలోని గరికపాడు. పోస్ట్‌గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో సౌతాఫ్రికా వెళ్లాడు. అక్క‌డ ఉద్యోగంలో చేరాడు. ఈ క్ర‌మంలో కొన్ని రోజుల క్రితం అత‌ను తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యాడు. దీంతో స్నేహితుల స‌హాయంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను అనారోగ్యానికి గురైన విష‌యాన్ని ఇక్క‌డున్న‌ త‌ల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపాడు.


దాంతో కుమారుడిని స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు హర్షవర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో మంగ‌ళ‌వారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. కానీ, ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో హర్షవర్ధన్‌రెడ్డి బుధ‌వారం ఉద‌యం చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రిలోనే చ‌నిపోయాడు. ఇక‌ ఇటీవల అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభం కావడంతో హర్షవర్ధన్‌ రెడ్డి స్వ‌దేశానికి తిరిగి వచ్చేందుకు స్నేహితుల సాయంతో జూన్ 6న‌ విమాన టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యువు ఒడికి చేరాడు. చేతికి అందివ‌చ్చిన‌ కొడుకు ఇలా అర్ధాంత‌రంగా త‌నువు చాలించ‌డంతో త‌ల్లిదండ్రులు గుండెలవిసెలా రోధిస్తున్నారు.       

Updated Date - 2020-05-28T18:50:51+05:30 IST