ప్రజా తీర్పు కోరండి!

ABN , First Publish Date - 2020-08-01T09:01:30+05:30 IST

మూడు రాజధానుల నిర్ణయంపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు దమ్ముం టే ఇదే

ప్రజా తీర్పు కోరండి!

  • కనీసం రెఫరెండం పెట్టండి
  • ‘మూడే’ అని జనమంటే ఇక మాట్లాడను
  • రాజధాని మారదని పదేపదే చెప్పారు
  • అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు
  • పాలన కాదు.. అభివృద్ధిని వికేంద్రీకరించాలి
  • ఒక ప్రాంతం, కులంపై ద్వేషంతో రాష్ట్రాన్ని నష్టపరుస్తున్నారు: చంద్రబాబు
  • ఇది రాష్ట్రానికి బ్లాక్‌ డే
  • ‘మూడు’పై చంద్రబాబు ఆక్రోశం

‘‘అమరావతిలో భూములన్నీ ఎవరో కొనేసుకొన్నారన్నారు. భూములు ఇచ్చిన రైతులకు వారి వాటాగా వచ్చిన ప్లాట్లను ఎవరికైనా అమ్ముకొనే హక్కుం ది. అలాగే కొందరు అమ్ముకొన్నారు. అదేమైనా నేరమా? ఒక పరిశ్రమతో ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంటే కట్టుబడాలి. ఉల్లంఘిస్తే న్యాయస్థానాలు ఊరుకోవు. అలాగే.. అమరావతిలో కూడా ప్రభుత్వం అధికారికంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. వారికి పూర్తి హక్కులు ఉన్నాయి’’


నాకు కాదు.. రాష్ట్రానికి నష్టం!

‘‘అమరావతిలాంటి ప్రాజెక్టును చంపేస్తున్నారంటే కళ్ల వెంట నీళ్లు తిరుగుతున్నాయి. నేను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా చేశాను. నాకు ఇంకేం కావాలి. నేను సుఖపడటానికి అమరావతి కట్టాలనుకోలేదు. నేను మహా అయితే మరో పదేళ్లు ఉంటాను. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు దానిని అనుభవిస్తారు. ఏదైనా చేస్తే భవిష్యత్‌ తరాలు గుర్తుంచుకోవాలన్న తపనతోనే అమరావతిని దేశానికి ఒక నమూనాగా నిలపాలని ప్రయత్నించాను. అది చచ్చిపోతే నాకు వ్యక్తిగతంగా జరిగే నష్టం ఏమీ లేదు. కానీ, రాష్ట్రం ఊహించనంతగా నష్టపోతుంది. వ్యక్తిగత రాగద్వేషాలకు రాష్ట్రాన్ని బలి చేస్తున్నారు. రాష్ట్రానికి ఇది చీకటి రోజు అని నేను అన్నమాట ఈ రోజు కొందరికి నచ్చకపోవచ్చు. కానీ, రెండు మూడేళ్ల తర్వాతైనా అంగీకరించక తప్పదు’’


చంద్రబాబు

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల నిర్ణయంపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు దమ్ముం టే ఇదే అంశంపై అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరాలని సవాల్‌ విసిరారు. లేనిపక్షంలో.. కనీసం రెఫరెండం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాజధాని బిల్లులపై గవర్నర్‌ సంతకం చేసిన రోజు రాష్ట్ర చరిత్రలో బ్లాక్‌ డేగా నిలిచిపోతుందన్నారు. శుక్రవారం సా యంత్రం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. ‘‘అమరావతికి అసెంబ్లీ వేదికపై మీరు మద్దతు పలికారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఎక్కడా రాజధాని మార్పు గురించి ప్రస్తావించలేదు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు.. అధికారంలోకి వచ్చినా రాజధాని మార్చబోమని పదేపదే చెప్పారు. ఎన్నికల్లో గెలవగానే రాజధాని మా ర్పు అంటూ మడమ తిప్పారు. మీ నిర్ణయానికి ప్రజల ఆమోదం ఉందని అనుకుంటే మళ్లీ ప్రజా తీర్పు కోరండి. లేదా మూడు రాజధానులు కావాలా... ఒక రాజధాని కావాలా అన్న ఒకే ఒక్క అంశంపై రాష్ట్రవ్యాప్తంగా రెఫరెండం కోరండి. ప్రజలు తీర్పు ఇస్తారు. మూడు రాజధానులే కావాలని ప్రజలు చెబితే నేను ఇక మాట్లాడను. ప్రజలు ఒకే రాజధాని కావాలంటే మీరు మీ నిర్ణయం మార్చుకోండి. ఏం చేస్తారో తేల్చుకోండి’ అని చంద్రబాబు సూచించారు.


రైతులకు నమ్మక ద్రోహం

రాజధాని నిర్మిస్తామని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు జగన్‌ నమ్మక ద్రోహం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. జరిగిన పరిణామాలన్నీ తెలిసీ గవర్నర్‌ సంతకం పెట్టడం మరో దుర్మార్గమని అన్నారు. ‘‘బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ శాసన మం డలి నిర్ణయం తీసుకొంది. ఈ విషయం అడ్వొకేట్‌ జనరల్‌ స్వయంగా హైకోర్టుకు తెలిపారు. సెలెక్ట్‌ కమిటీకి పంపినా ప్రభుత్వం అధికారుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని శాసన మండలి చైర్మన్‌ స్వయంగా గవర్నర్‌ను కలిసి చెప్పారు. ఇవన్నీ తెలిసి కూడా గవర్నర్‌ ఎలా సంతకాలు పెడతారు?’’ అని ప్రశ్నించారు. గవర్నర్‌ సంతకం పెట్టినంత మాత్రాన చట్టం, రాజ్యాంగం మారిపోతాయని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ తొలగింపు నిర్ణయంపై ఆయన సంతకం పెట్టారు. ఏమైంది? చివరకు రాజ్యాంగమే గెలిచింది’ అని తెలిపారు.

 

వికేంద్రీకరణ అంటే ఇదా?

రాష్ట్రానికి కావాల్సింది పాలనా వికేంద్రీకరణా లేక అభివృద్ధి వికేంద్రీకరణా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధానులతోనే అభివృద్ధి వస్తుందని అనుకొంటే మొత్తం పదమూడు జిల్లాల్లోనూ రాజధానులు పెట్టవచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మేం అమరావతిని ప్రకటించే రోజే రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ఏం చేయబోతున్నామో జిల్లాల వారీగా అసెంబ్లీలో ప్రకటించాం. ఐదేళ్ల వ్యవధిలో కొన్ని చేశాం. మరోసారి అవకాశం వచ్చి ఉంటే మరికొన్ని చేసేవాళ్లం. రాజధానులు పెడుతున్నామని మభ్యపెడితే ప్రజల కడుపు నిండదు’’ అని చంద్రబాబు అన్నారు. ఏవేవో చేస్తామని కబుర్లు చెప్పిన వైసీపీ ఈ పద్నాలుగు నెలల్లో ఒక్క సాగునీటి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేకపోయిందని, పట్టుమని పది ఉద్యోగాలు తెచ్చే ఒక పరిశ్రమను రాష్ట్రానికి తేలేకపోయిందని ఆయన విమర్శించారు. రా జధాని తరలింపుపై పెట్టిన శ్రద్ధలో కనీసం పదో వంతు కరోనా వ్యాధి అదుపుపై పెట్టలేకపోయారని ఆయన విమర్శించారు. 


బీజేపీ మోసం చేసింది: గోరంట్ల

‘‘రాజ్యాంగాన్ని గవర్నర్‌ ఖూనీ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి సరెండరయ్యారు. రాష్ట్ర విభజనలో కాంగ్రె్‌సకు ఎంత పాపముందో, బీజేపీకీ అంతే ఉంది’’ అని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. ‘‘పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్ల్లులు సెలక్ట్‌ కమిటీలో పెండింగ్‌లో ఉన్నాయని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు చెప్పినా ఎందుకు విస్మరించారు? కేంద్రం చేసి న చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ బిల్లులున్నాయి కాబట్టి ఆర్టికల్‌ 251 కిందకు ఇవి వస్తాయి. వీటిపై అంతిమ అధికారం న్యాయ సమీక్షదే’’ అని యనమల స్పష్టం చేశారు.  


జగన్‌ ట్రాప్‌లో గవర్నర్‌: లోకేశ్‌

‘‘ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీ నినాదం. వ్యవస్థల్ని నాశనం చేయడం జగన్మోహన్‌రెడ్డి ట్రేడ్‌ మార్క్‌. ఆ ట్రాప్‌లో గవర్నర్‌ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.  




మేం వదిలి పెట్టం... పోరాడతాం

ఈ అంశాన్ని తాము వదిలిపెట్టేది లేదని, బలంగా పోరాడతామని చంద్రబాబు ప్రకటించారు. ‘అమరావతి జేఏసీ రెండు రోజులు నిరసనలకు పిలుపునిచ్చింది. మేం మా పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఇందులో పాల్గొంటాం. అటు న్యాయ పోరాటం... ఇటు ప్రజా క్షేత్రంలో పోరాటం రెండూ చేస్తాం. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకూ విశ్రమించం’ అని  ఆయన చెప్పారు. ఈ పోరాటం కేవలం అమరావతి జేఏసీది అనుకోరాదని... ప్రజలంతా తమకు తోచిన పద్ధతుల్లో నిరసనలో పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు రోడ్ల పైకి రాలేదు కాబట్టి వారు ఆమోదిస్తున్నారని అనుకొంటే తప్పవుతుందని, రాష్ట్ర విభజన సమయంలో రోడ్లపైకి రాకపోయినా ఆ నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల్లో తగిన శిక్ష వేశారని ఆయన చెప్పారు. విభజన చట్టం ప్రకారం కేంద్రానికి రాజధానిపై బాధ్యత ఉందని ఆయన చెప్పారు. 

Updated Date - 2020-08-01T09:01:30+05:30 IST