వీధి నాటకాలు పునరుజ్జీవం పొందాలి
ABN , First Publish Date - 2021-10-15T06:56:14+05:30 IST
వీధి నాటకాలు పునరుజ్జీవనం పొందాలని, ఇందుకు కళాకారులు కృషి చేయాలని సినీనటుడు కాకరాల వీరవెంకట సత్యనారాయణ పేర్కొన్నారు.
సినీనటుడు కాకరాల
తెనాలిలో ముగిసిన జాతీయ స్థాయి నాటికల పోటీలు
తెనాలి అర్బన్, అక్టోబరు 14: వీధి నాటకాలు పునరుజ్జీవనం పొందాలని, ఇందుకు కళాకారులు కృషి చేయాలని సినీనటుడు కాకరాల వీరవెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటికల పోటీలు గురువారం ముగిశాయి. వీణా అవార్డ్స్ 2021 పేరిట కళల కాణాచి, వేదగంగోత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు సభలో ఇరువురు సినీనటులకు పురస్కారం ప్రదానం చేశారు. ఎ.ఆర్.కృష్ణ రంగస్థల పురస్కారాన్ని సినీనటుడు కాకరాలకు ప్రదానం చేశారు. నటవిశిష్ట బిరుదు ను సినీనటుడు మురళీశర్మకు అందించారు. గోగినేని కేశవరావు అధ్యక్షతన జరిగిన సభలో కాకరాల మాట్లాడుతూ నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి వీధి నాటకాలకే ఉందన్నారు. సినీనటుడు మురళీశర్మ మాట్లాడుతూ, కళలు, కళాకారులకు నిలయమైన తెనాలిలో పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, కళారంగాన్ని కాపాడేందుకు శాయశక్తులా సహకారం అందిస్తామని చెప్పారు. సినీ నిర్మాత దాసరి కిరణ్కుమార్ మాట్లాడుతూ, సమా జం ఆదరణ కోల్పోతున్న నాటక రంగాన్ని నిలబెట్టేందుకు తెనాలి కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ, కళామతల్లి సేవ చేసేందుకు నైతిక బలాన్ని అందించాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర క్రిస్టినా, మున్సిపల్ వైస్ చైర్మన్ మా లేపాటి హరిప్రసాద్, విజయవాడ వేదగంగోత్రి వ్యవస్థాపకులు వరప్రసాద్ ప్రసంగించిన సభలో కళల కాణాచి ప్రధాన కార్యదర్శి షేక్ జానీబాషా, ఉపా ధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, ఎంపీ కన్నేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, గోగినేని కేశవరావు, బడుగు మోహనరావు తదితరులు ప ర్యవేక్షించారు.
ఉత్తమ ప్రదర్శనగా ఆస్తికలు నాటిక
ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా పెదకాకాని గంగోత్రి కళాకారులు ప్రదర్శించిన ఆస్తిక లు నాటిక ఎంపికైంది. తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారి నాటిక ఓహోం-ఓహోం నాటిక ద్వితీయ బహుమతి, కరీంనగర్ చైతన్య కళాభారతి నాటిక తృతీయ బహుమతి లభించిం ది. ఉత్తమ నటుడిగా పి.శివరామ్, ఉత్తమ నటిగా లహరి, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా ఏడుకొండలు, ఉత్తమ ప్రతినాయకునిగా మంచాల రమేష్, ఉత్తమ హాస్యనటునిగా గం గోత్రి సాయి, ఉత్తమ సహాయ నటిగా సతీష్కుమార్, ఉత్తమ రచయితగా పి.మృత్యుంజయరావు, ఉత్తమ దర్శకునిగా గంగోత్రి సాయి, ఆహార్యం పి.శివ, శేషగిరి, రంగాలంకరణ, శివ, మధు, సంగీతం రాజభూషణం, అప్పారావు బహుమతులు అందుకున్నారు. జ్యూరి 1, 2, 3, 4 అవార్డులను కళాకారులు రాజభూషణం, అప్పారావు, అంకమ్మరావు, వరప్రసాద్, గోవర్ధనరెడ్డి, శివరామిరెడ్డిలకు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా ఎంపీ కన్నెశ్వరరావు, వేణుగోపాల్, ఆంజనేయ నాయుడు వ్యవహరించారు.