పెంగ్ క్షేమమేనా?
ABN , First Publish Date - 2021-11-21T08:36:35+05:30 IST
చైనా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయ్ కొద్దిరోజుల కిందట అదృశ్యమవడంతో ఆమె క్షేమసమాచారాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలను చైనా ప్రభుత్వ టీవీ
ఆన్లైన్లో ఫొటోలు విడుదల చేసిన చైనా
బీజింగ్: చైనా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయ్ కొద్దిరోజుల కిందట అదృశ్యమవడంతో ఆమె క్షేమసమాచారాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలను చైనా ప్రభుత్వ టీవీ ఆన్లైన్లో విడుదల చేసింది. ‘వీచాట్’ మెసేజ్ సర్వీ్సలోని పెంగ్ ఖాతా నుంచి తాము ఆ ఫొటోలు సేకరించామని టీవీ ఉద్యోగి షెన్ షీవీ శనివారం వెల్లడించారు. ఆ ఫొటోలకు ‘హ్యాపీ వీకెండ్’ అన్న క్యాప్షన్ ఉంది. ఇక.. షువాయ్ త్వరలో ప్రజల ఎదుటకు వస్తుందని చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే పత్రిక ఎడిటర్ ఒకరు తెలిపారు. చైనా టీవీ విడుదలజేసిన ఫొటోలలో ఒకదానిలో 35 ఏళ్ల పెంగ్ ఓ గదిలో పిల్లిని ఎత్తుకొని నవ్వుతూ కనిపించింది. మరో చిత్రంలో పాండా బొమ్మతో ఉంది. ఆమె కూర్చున్న గదిలో పెద్ద సంఖ్యలో బొమ్మలు కూడా కనిపించాయి. ట్రిపుల్ ఒలింపియన్ షువాయ్ ఈ చిత్రం తాజాదేనని విశ్వసనీయ వర్గాల ద్వారా తాము ధ్రువీకరించుకున్నామని కమ్యూనిస్టు పార్టీ ఆంగ్ల పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హూ క్సిజిన్ చెప్పారు. గత కొద్దిరోజులుగా ఆమె తన ఇంట్లోనే ఉందని, ఎవరినీ కలువకూడదని పెంగ్ భావిస్తోందని ఆయన వెల్లడించారు. తనపై చైనా మాజీ ఉపప్రధాని ఝాంగ్ గవోలి లైంగిక దాడి చేశారని ఈనెల 2న సంచలన ఆరోపణలు చేసిన పెంగ్.. నాటినుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.