బాత్రూమ్లో ఉరేసుకుని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-09-17T15:10:49+05:30 IST
ఆన్లైన్ తరగతులతో మానసిక ఒత్తిడి గురైన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని...
చెన్నై : శివగంగ జిల్లాలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం విషాదాన్ని నింపింది. ఆన్లైన్ తరగతులతో మానసిక ఒత్తిడి గురైన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. త్రిభువనం సమీపంలోని సెల్లపనేందల్ గ్రామానికి చెందిన సత్యమూర్తి దుబాయ్లో ఉద్యోగం చేస్తూ గత మార్చిలో స్వగ్రామానికి చేరుకొని ఆటోను అద్దెకు తీసుకొని నడుపుతున్నాడు. అతనికి భార్య తనం, కుమార్తె సుభిక్ష, కుమారుడు శిబిరాజ్లున్నారు. సుభిక్ష మదురైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ చదువుతూ, ప్రస్తుతం ఆన్లైన్ తరగతుల్లో పాల్గొంటోంది.
ఈ నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం ఇంటి వెనుకవైపున్న బాత్రూమ్లో సుభిక్ష ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న త్రిభువనం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త్రిభువనం ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.