కొవిడ్ ఆస్పత్రిలో టెస్టింగ్ కిట్ల కొరత
ABN , First Publish Date - 2022-01-18T05:39:25+05:30 IST
మదనపల్లె జిల్లా వైద్యశాలలోని కొవిడ్ ఆస్పత్రిలో కరోనా టెస్టింగ్ కిట్ల కొరత ఏర్పడింది. సరఫరా తక్కువగా ఉండడంతో ఆ సమస్య తలెత్తినట్టు ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు.
సరఫరా తక్కువగా ఉందంటున్న అధికారులు
పరీక్ష కోసం వచ్చి వెనుదిరుగుతున్న ప్రజలు
మదనపల్లె క్రైం, జనవరి 17: మదనపల్లె జిల్లా వైద్యశాలలోని కొవిడ్ ఆస్పత్రిలో కరోనా టెస్టింగ్ కిట్ల కొరత ఏర్పడింది. సరఫరా తక్కువగా ఉండడంతో ఆ సమస్య తలెత్తినట్టు ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. దీంతో వ్యాధి నిర్ధరణ పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చిన ప్రజలు చేసేదిలేక వెనుదిరుగుతున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మదనపల్లె కొవిడ్ ఆస్పత్రిలో 60 పడకలు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా రోజూ 50 నుంచి 60 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో 30 నుంచి 40 మందికి పాజిటివ్ వస్తోంది. అయితే కొద్దిరోజులుగా ఆస్పత్రిలో టెస్టింగ్ కిట్ల కొరత ఏర్పడింది. రోజుకు 20 నుంచి 30 కిట్లు మాత్రమే సరఫరా చేస్తుండడంతో సమస్య నెలకొంది. కిట్ల కొరతతో అందరూ ఇబ్బందిపడుతున్నారు. ఒమైక్రాన్ భయంతో టెస్టులు చేసుకునేందుకు ప్రజలు ఆస్పత్రికి వస్తున్నట్టు తెలుస్తోంరు. కాగా కిట్ల కొరతతో కొందరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జ్వరంతో బాధపడుతూ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్టులు చేయాలని, ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు సభ్యులకు వద్దని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో లక్షణాలు ఉన్నవారికి మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. ఈనేపథ్యంలో కొవిడ్ ఆస్పత్రికి రోజూ 60 నుంచి వందమంది వస్తుండగా. ఇందులో 20 నుంచి 30 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు. కాగా డివిజన్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వ్యాధి బయటపడితే మెరుగైన వైద్యం చేయించుకునే దిశగా ఆరాటపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కిట్ల కొరత నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.