కొవిడ్ లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు
ABN , First Publish Date - 2022-01-23T06:35:32+05:30 IST
ప్రభుత్వం నుంచి కొత్తగా అందిన మార్గదర్శకాల ప్రకారం ఇకపై కొవిడ్ లక్షణాలున్న వారికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని రుయాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి తెలిపారు.
తిరుపతి సిటీ, జనవరి 22: ప్రభుత్వం నుంచి కొత్తగా అందిన మార్గదర్శకాల ప్రకారం ఇకపై కొవిడ్ లక్షణాలున్న వారికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని రుయాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో లాగా వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసే పరిస్థితి లేదని, ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే మిగిలిన వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని, ప్రత్యేకంగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్ బాధితుల కోసం ఆస్పత్రుల్లో 1000 పడకలను సిద్ధంగా ఉంచామని, తీవ్రత ఎక్కవగా ఉన్న వారికి పడకలు కేటాయించి వైద్యం అందిస్తామని, సాధారణ లక్షణాలున్న వారు ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కోలుకుంటారన్నారు. ఇంట్లో సరైన సదుపాయం లేని వారు విష్ణునివాసం కొవిడ్ కేంద్రంలో ఉండి చికిత్స పొందవచ్చని సూచించారు.వ్యాక్సిన్ వేసుకోని 60 ఏళ్లు పైబడిన వారు కొవిడ్ లక్షణాలతో వస్తే వారికి పరీక్షలు అవసరం లేకుండానే హోం ఐసోలేషన్ కిట్లను ఇచ్చి పంపుతున్నామని చెప్పారు. సాధారణ జలుబు, జ్వరం ఉన్నా భయాందోళనలకు గురికాకుండా జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కోలుకుంటారన్నారు.ఆస్పత్రి వర్కింగ్ కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.