నాడు చెంపలు వాయించి... నేడు రాఖీ కట్టింది!

ABN , First Publish Date - 2021-08-23T13:32:30+05:30 IST

యూపీలోని లక్నోకు చెందిన ప్రియదర్శిని అనే యువతి...

నాడు చెంపలు వాయించి... నేడు రాఖీ కట్టింది!

లక్నో: యూపీలోని లక్నోకు చెందిన ప్రియదర్శిని అనే యువతి గత జూలై 30న రాత్రి క్యాబ్ డ్రైవర్ చెంపలు వాయించిన ఉదంతం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు అదే యువతి మళ్లీ చర్చల్లోకి వచ్చింది. క్యాబ్ డ్రైవర్‌కు 22 సార్లు చెంపలు వాయించిన ఆ యువతికి ‘థప్పడ్ గర్ల్’ అనే పేరొచ్చింది. ప్రియదర్శిని రక్షాబంధన్ సందర్భంగా ఆ క్యాబ్ డ్రైవర్‌కు రాఖీ కట్టి... నాడు అతనితో జరిగిన గొడవ పూర్తిగా సమసిపోయేలా చేసింది. ఇందుకోసం ఆమె తమ ఇంటిని అందంగా అలంకరించి, ప్రత్యేకమైన స్వీట్లు కొనుగోలు చేసి, ఆ డ్రైవర్‌కు సాదరంగా ఆహ్వానం పలికి రాఖీ కట్టి, స్వీట్లు తినిపించింది. ఆమె గతంలో నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌పై దాడిచేసి, 22సార్లు చెంపలు వాయించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


సాదత్ అలీ సిద్ధిఖీ అనే క్యాబ్‌ డ్రైవర్ వాహనం నడుపుతూ, రోడ్డు దాటుతున్న ఆమెకు సమీపంగా వచ్చాడు. దీంతో ఆమె డ్రైవర్ తనను ఢీకొట్టబోయాడని ఆరోపిస్తూ, అతనిపై విచక్షణరహితంగా దాడిచేసింది. అడ్డుకోబోయిన మరో వ్యక్తి చెంపలు కూడా వాయింది. అయితే పోలీసులు ఈ ఉదంతంపై సాగించిన దర్యాప్తులో అసలు నిజం వెల్లడయ్యింది. ఆ యువతే ప్రమాదకరంగా రోడ్డును దాటుతున్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. ఫలితంగా క్యాబ్‌ డ్రైవర్‌ను కొట్టిన ఆ యువతిదే తప్పని నిర్ధారణ అయ్యింది. 


Updated Date - 2021-08-23T13:32:30+05:30 IST