‘కూల్‌’ వ్యాపారం డౌన్‌

ABN , First Publish Date - 2020-05-20T11:36:48+05:30 IST

మండుటెండలో బయట తిరిగి ఇంటికొచ్చి మట్టికుండలో నుంచి ఓ గ్లాసు నీళ్లు తాగితే ప్రాణం లేచొచ్చినట్లు అనిపి

‘కూల్‌’ వ్యాపారం డౌన్‌

సంక్షోభంలో వేసవి వ్యాపారాలు

చితికిపోయిన కుండల తయారీదారులు

వేసవి సీజన్‌.. కరోనార్పణం


ఒంగోలు(జడ్పీ), మే 19: మండుటెండలో బయట తిరిగి ఇంటికొచ్చి మట్టికుండలో నుంచి ఓ గ్లాసు నీళ్లు తాగితే ప్రాణం లేచొచ్చినట్లు అనిపి స్తుంది.. రోడ్డు మీద తిరిగి తిరిగి నిస్సత్తువ ఆవహించిన వేళ గోలీసోడానో, నిమ్మకాయ నీళ్లో తాగితే కొత్త శక్తి వచ్చి చేరుతుంది.. ఎండ దెబ్బకు ఒంట్లో  ఉన్న సత్తువ మొత్తం నీరుగారిపోతే ఏదో ఒక పండ్లరసాన్ని తీసుకుంటే కొత్త ఉత్సాహం వస్తుంది.. వేసవికాలంలో మనకు కనిపించే దృశ్యాలివి. 


మండే ఎండలను తలచుకుని భానుడిమీద కోపాన్ని ప్రదర్శిస్తుంటారు ప్రజానీకం. ఆ భానుడు ఎంతగా చిటపటలాడితే తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వేసవిలో వర్ధిల్లుతుందని ఆశపడుతుంటారు ఈ సీజన్‌ మీదే ఆధారపడి బతికే వ్యాపారులు. ఇలాంటి వ్యాపారులందరి నెత్తిన కరోనా పిడుగు శరాఘాతమైంది. ఈ మూడు నెలల సీజన్‌ మీద ఆధారపడే సంవత్సరకాలం బతుకులను వెళ్లదీస్తుంటారు. మే నెల ఆఖరు దాకా లాక్‌డౌన్‌ పొడిగించారు. దీంతో సీజన్‌ మొత్తం ఆవిరైపోయినట్లే. రాబోయే రోజుల్లో తమ బతుకు చిత్రాన్ని తలచుకుని చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.


కుండలకు వేసవిలోనే గిరాకీ..

ప్రిజ్‌లాంటి ఉపకరణాలు మార్కెట్‌ను ముంచెత్తినా కుండలకు ఆదరణ కొనసాగుతూనే ఉంది. వేసవి రావడానికి నెల రోజుల ముందుగానే కుండ ల తయారీలో నిమగ్నమవుతారు. అలాంటి కుటుంబాలు జిల్లావ్యాప్తంగా ఉన్నాయి. వీరిలో ఎక్కువశాతం పక్క జిల్లాలకు కూడా దిగుమతి చేస్తుం టారు. ఈ సంవత్సరం కూడా వ్యాపారం బాగానే ఉంటుందనే ఉద్దేశంతో నెల ముందునుంచే కుండల తయారీని మెదలుపెట్టారు. కరోనా వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లింది. ఉన్న కుండలు అమ్ముడుపోక ఆర్థిక ఇబ్బం దులతో సతమతమవుతున్నారు.

 

జ్యూస్‌ వ్యాపారాలు డీలా..

వేసవి సీజన్‌మీదే ఆధారపడి ఐస్‌క్రీమ్‌, సోడాబండ్లు, జ్యూస్‌ వ్యాపారం సాగుతుంది. దీనిపై ఆధారపడినవారు లాక్‌డౌన్‌ మూలానా ఆదాయ మా ర్గం లేక విలవిలలాడిపోతున్నారు. మామూలు రోజులతో పోల్చితే మూడిం తల ఎక్కువ ఆదాయం వేసవిలో వస్తుంది. అలాంటి సీజన్‌ మొత్తం కరోనా మూలానా వృథా అయపోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. కనీసం బండ్లకు, షాపులకు అద్దెలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నామని వారు బోరుమంటున్నారు. 


ప్రభుత్వం ఆదుకోవాలి..

ప్రకృత్తి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆదుకుంటాయి. ఇది కూ డా అనుకోని విపత్తే కనుక ఆదుకోవాలని వేసవిమీద ఆధారపడి బతికే వ్యాపారులు వేడుకుంటున్నారు. మే తరువాత లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తమకు ఎలాంటి మేలు జరగదని వారు వాపోతున్నారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగిందని వారు ఆవేదన చెందుతున్నారు.


రూపాయి కళ్ల చూడలేదు..

ఎండాకాలం వస్తే చేతినిండాపనితో క్షణం తీరిక లేకుండా గడిపేవాళ్లం. కానీ ఈ సీజన్‌లో మాత్రం రూపాయి ఆదాయం కళ్ల చూడలేదు. కుండలు అడిగేవారే లేరు. జనం కొనడానికయినా వారు బయటకు రావాలి కదా. ఇప్పుడు ఏమి చేయాలో పాలు పోవడం లేదు    

   -  పి.శ్రీనివాసరావు, కుండల వ్యాపారి 

Updated Date - 2020-05-20T11:36:48+05:30 IST