దారిదోపిడీ కథ అల్లిన నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2020-05-28T09:26:37+05:30 IST
డబ్బు కాజేసి దారిదోపిడీ కథ అల్లిన నిందితుడిని ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
రూ. 8,51,950 స్వాధీనం
కొత్తపేట, మే 27 (ఆంధ్రజ్యోతి): డబ్బు కాజేసి దారిదోపిడీ కథ అల్లిన నిందితుడిని ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ. 8,51,950 స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సన్ప్రీత్సింగ్ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, కోదాడ శ్రీ సాయిచరణ్ పేపర్మిల్స్లో మారం అచ్చిరెడ్డి(28) అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఈనెల 25న నగరంలోని పలు ప్రాంతాల్లో ఏజెంట్ల వద్ద రూ. 8.50 లక్షలు వసూలు చేసుకొని వెళ్తుండగా గుర్రంగూడ - నాదర్గుల్ దారిలో తెల్లటి బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు నగదు లాక్కున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించగా అతడు కట్టుకథ అల్లినట్లు తేలింది. ప్రేమించిన యువతి వైద్యం కోసం దారిదోపిడీ కథ అల్లినట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడు గుర్రంగూడ సమీపంలో పొదల్లో ప్లాస్టిక్ బ్యాగ్లో దాచిన రూ. 8.50 లక్షలు, అతడి నుంచి రూ. 1,950 స్వాధీనం చేసుకున్నారు. ప్రేమించిన యువతి వైద్యం ప్రస్తావన కూడా కట్టుకథేనా అని విచారిస్తున్నామని డీసీపీ చెప్పారు.