రేపటి నుంచి.. రైళ్ల కూత
ABN , First Publish Date - 2020-05-31T11:39:24+05:30 IST
ఇంచుమించు 70 రోజుల లాక్డౌన్ అనంతరం గుంటూరు రైల్వేస్టేషన్లో రైళ్ల రాకపోకలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రైల్వేశాఖ తొలుత
సోమవారం ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్కు స్పెషల్ ట్రైన్
రాత్రికి సికింద్రాబాద్ నుంచి నడికుడి, కాజీపేట మార్గాల్లో రెండు రైళ్లు రాక
ఏర్పాట్లు చేస్తున్న గుంటూరు రైల్వే డివిజనల్ అధికారులు
గుంటూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): ఇంచుమించు 70 రోజుల లాక్డౌన్ అనంతరం గుంటూరు రైల్వేస్టేషన్లో రైళ్ల రాకపోకలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రైల్వేశాఖ తొలుత గుంటూరు నుంచి కాజీపేట మార్గంలో ఒక రైలుని నిత్యం సికింద్రాబాద్కు, అలానే అక్కడినుంచి గుంటూరుకు మరో రైలుని నడిపేందుకు నిర్ణయం తీసుకొంది. అలానే రోజూ సికింద్రాబాద్ నుంచి హౌరాకు గుంటూరు మీదగా ఒక రైలు, హౌరా నుంచి గుంటూరుకు మరో రైలుని నడపనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటలకు గుంటూరు నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలు విజయవాడ, కాజీపేట మార్గంలో బయలుదేరి వెళ్లనుంది. ఇందుకోసం రైల్వేవర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.
స్టేషన్లో థర్మల్ స్ర్కీనింగ్
ఈ రైళ్లలో ప్రయాణం చేయబోయే ప్రయాణీకులు రెండు గంటల ముందుగానే రైల్వేస్టేషన్కు చేరుకోవాలి. క్యూలైన్లో టీటీఈ టిక్కెట్ తనిఖీ చేస్తారు. ప్రతీ ఒక్కరూ తప్పక మాస్కు ధరించాలి. రైల్వేస్టేషన్లో చేతులను శానిటైజర్తో శుభ్రంగా కడుక్కోవాలి. స్టేషన్ ఆవరణలోనే థర్మల్ స్కానింగ్ చేసి కోవిడ్-19 లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి రైల్వే అధికారులు అనుమతిస్తారు. స్లీపర్క్లాస్లలో ప్రయాణం చేసేవారు స్వంతంగానే బ్లాంకెట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. గతంలో వలే ఎయిర్ కండీషనింగ్ ఉండదు. పరిమితంగానే ఏసీ ఉంటుంది. స్టేషన్లలో తినుబండారాల కోసం రైలు దిగడం, తిరిగి ఎక్కడం వంటివి చేయరాదు. రైళ్లలోనే ప్యాక్డ్ ఫుడ్ అందిస్తారు. వీలైనంత వరకు ప్రయాణీకులు ఇంటి వద్దనే ఆహారం సిద్ధం చేసుకొని తెచ్చుకోవాలి. తాగునీరు కూడా వెంట తెచ్చుకోవాలి.
తప్పనిసరిగా హోం క్వారంటైన్
ప్రయాణం పూర్తి అయిన తర్వాత గుంటూరు జిల్లా పరిధిలోని రైల్వేస్టేషన్లలో దిగే ప్రయాణీకులు తప్పనిసరిగా హోం క్వారంటైన్ పాటించాల్సిందే. ఎంఎస్ఎస్ పోర్టల్లో డేటాని అందుబాటులో ఉంచుతారు. వార్డు వలంటీర్/ఏఎన్ఎం/ఆశావర్కర్లు నిత్యం ప్రయాణికుడి ఇంటికి వెక్షౌ పరిశీలిస్తారు. ఈ డేటా పోలీసుస్టేషన్కు కూడా చేరుతుంది. దాంతో ప్రయాణీకుడు హోం క్వారంటైన్లో ఉంటున్నారా, లేదా అనేది ఎస్హెచ్వోలు పర్యవేక్షిస్తారు. వీరికి ర్యాండమ్గా కరోనా పరీక్షలు కూడా చేయిస్తారు.