మంచి గెలిచిన రోజు!

ABN , First Publish Date - 2020-10-25T05:30:00+05:30 IST

అనాదిగా లోకంలో మంచికీ, చెడుకూ మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంది. రాక్షస ప్రవృత్తులపై అంతిమ విజయం దైవ శక్తిదేనని చాటే ఘట్టాలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి...

మంచి గెలిచిన రోజు!

  • నేడు విజయదశమి


అనాదిగా లోకంలో మంచికీ, చెడుకూ మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంది. రాక్షస ప్రవృత్తులపై అంతిమ విజయం దైవ శక్తిదేనని చాటే ఘట్టాలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. ఆ విజయాన్ని వేడుకగా చేసుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. పురాణపరంగానే కాకుండా సాంస్కృతికంగానూ ప్రాముఖ్యం ఉన్న పండుగ విజయదశమి. మంచిపై చెడు గెలిచిన రోజుగా దసరా పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఇది మహిషాసురుణ్ణి దుర్గాదేవి సంహరించిన రోజనీ, రావణుణ్ణి శ్రీరాముడు వధించిన రోజు అనీ పురాణాలు పేర్కొంటున్నాయి. ఇది. మానవులు కామ, క్రోద, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు అనే అరిషడ్వర్గాలను జయించాలనీ, అదే ఈ విజయదశమి పండుగలోని అంతరార్థమనీ పెద్దలు చెబుతారు. విజయదశమి నాడు ఏది ప్రారంభించినా విజయం తథ్యం అనే విశ్వాసం ఉంది. 


శమీ శత్రు వినాశినీ...

శమీ వృక్షం (జమ్మి చెట్టు)లో అపరాజితా దేవి కొలువై ఉంటుందని విశ్వాసం. విజయదశమి రోజున అపరాజితా దేవిని శమీవృక్షం వద్ద పూజించే సంప్రదాయం ఉంది. అమ్మవారి సహస్ర నామాల్లో ‘అపరాజిత’ ఒకటి. అంటే ‘పరాజయం లేనిది’ అని అర్థం. ‘యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా’ అని ‘అపరాజితా స్తోత్రం’ వర్ణించింది. అపరాజితా దేవి సర్వ జీవుల్లో శక్తి రూపంలో ఉంటుందని భావం. దానవీయ గుణాలపై గెలుపు సాధించడానికి మనలో ఉన్న శక్తిని ప్రేరేపించాలని అమ్మవారిని ప్రార్థించాలి. 

దేవ దానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఉద్భవించిన పవిత్రమైన దేవతా వృక్షాల్లో జమ్మి చెట్టు ఒకటని చెబుతారు. రావణ సంహారానికి ముందు శ్రీరాముడు శమీ వృక్షానికీ, అపరాజితా దేవికీ పూజలు ఆచరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. పాండవులు అజ్ఞాతవాసం ముందు తమ ఆయుధాలను శమీ వృక్షం మీద దాచారనీ, అజ్ఞాతవాసం ముగిశాక వాటిని తిరిగి తీసుకున్నారనీ మహాభారతంలో కథ ఉంది. దసరా నాడు...


  • శమీ శమయతే పాపం శమీ శత్రువినాశిని 
  • అర్జునస్య ధనుర్ధారి  రామస్య ప్రియదర్శిని...

అనే శ్లోకం పఠించి, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే... అపరాజిత దేవి కటాక్షంతో శత్రు భయం తొలగి విజయం చేకూరుతుందనీ సకల కార్యసిద్ధి కలుగుతుందనీ పెద్దలు చెబుతారు.   


శుభప్రదం పాలపిట్ట దర్శనం

దసరా పండుగలో శమీ వృక్షంతో పాటు పాల పిట్టకు ఉన్న ప్రాధాన్యం కూడా ఎక్కువే. పాలపిట్టను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న జానపద గాథ ప్రకారం... పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి వస్తూ ఉండగా, వారికి పాలపిట్ట కనిపించింది. వారు దాన్ని చూసినప్పటి నుంచీ వరుసగా అన్నీ విజయాలే కలిగాయట! అందుకే విజయ దశమి రోజున పాలపిట్టను దర్శించడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పాలపిట్టను భక్తిప్రపత్తులతో ఆరాధిస్తారు.

Updated Date - 2020-10-25T05:30:00+05:30 IST