బైక్‌ చక్రంలో పడి పసికందు మృతి

ABN , First Publish Date - 2022-01-24T05:41:31+05:30 IST

రెండు నెలల పసికందు. జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తీసుకెళ్లారు.

బైక్‌ చక్రంలో పడి పసికందు మృతి

కోడుమూరు(రూరల్‌), జనవరి 23:  రెండు నెలల పసికందు.  జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుడికి చూపించి మందులు తీసుకున్నారు. తిరిగి స్వగ్రామానికి చేరారు. అయితే  తల్లి ఒడిలోని బేబి కిట్‌లో వెచ్చగా నిద్దురోయిన బాబు కనిపించలేదు. పసికందు బేబి కిట్‌ నుంచి జారి  బైక్‌ వెనుక చక్రంలో  ఇరుక్కున్నాడు. అతి కష్టం మీద బాబును బైటికి తీశారు. అప్పటికే చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన కోడుమూరు మండలంలోని ఎర్రదొడ్డి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మల్లికార్జున, సుభాషిణి దంపతులు కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు.  ఈ మధ్యనే వారికి రెండో సంతానంగా మగబిడ్డ పుట్టాడు. రాముడు అనే పేరు పెట్టుకున్నారు. రెండవ  పిల్లాడికి సుస్తి చేయడంతో శనివారం సాయంత్రం కోడుమూరులో వైద్యుడికి చూపించి తిరిగి గ్రామానికి చేరుకున్నారు. ప్రయాణం మధ్యలో ఈ ఘటన జరిగింది.  గ్రామంలో విషాదం నెలకొంది.

Updated Date - 2022-01-24T05:41:31+05:30 IST