ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి బీజేపీనే కారణం

ABN , First Publish Date - 2021-12-03T07:03:08+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి బీజేపీనే కారణం


సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సుఖేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి


స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది కేంద్ర ప్రభుత్వమే: ఎమ్మెల్సీ గుత్తా 

నల్లగొండ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది యాసంగి ధాన్యం ఇంకా 50శాతం ఎఫ్‌సీఐ గోదాంలోనే ఉందని, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటుచేసి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం రీసైక్లింగ్‌, కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు బీజేపీ నేతలు ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కొనుగోలు ప్రక్రియ చేసేది కేంద్రమే, అయినప్పుడు అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యుత్‌ సంస్కరణల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరికి మద్దతు ధర కంటే రూ.800 తక్కువకే రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారని గుర్తుచేశారు. స్థానిక రైతులకు ఇ బ్బందులు కలగొద్దనే ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గతంలో కంటే స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ గౌరవ వేతనం సీఎం కేసీఆర్‌ భారీగా పెంచారని అన్నారు. సమావేశంలో నల్లగొండ జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పాశం రాంరెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T07:03:08+05:30 IST