సరిగ్గా 7 నెలల క్రితం పెళ్లి.. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న ఈ యువతి చివరకు ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి..?

ABN , First Publish Date - 2021-11-26T21:32:24+05:30 IST

ఆమెకు ఏడు నెలల క్రితం పెళ్లి జరిగింది.. ఎన్నో కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది..

సరిగ్గా 7 నెలల క్రితం పెళ్లి.. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న ఈ యువతి చివరకు ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి..?

ఆమెకు ఏడు నెలల క్రితం పెళ్లి జరిగింది.. ఎన్నో కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది.. కొన్ని రోజులకే ఆమె కలలన్నీ కల్లలుగా మారాయి.. తన వైవాహిక జీవితం ఎంత మాత్రం సుఖంగా సాగదని ఆమెకు అర్థమైంది.. ఆవేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకుంది.. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. అత్తింటి వేధింపులే తమ కూతురి మరణానికి కారణమంటూ ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.. హర్యానాలోని రోహ్‌తక్‌లో ఈ ఘటన జరిగింది. 


రోహ్‌తక్‌కు సమీపంలోని ఖాన్సీ గ్రామానికి చెందిన సాక్షి అనే యువతి గోరియా గ్రామానికి చెందిన మోనూ గజ్జర్ అనే యువకుడిని ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తింటికి చేరుకున్న సాక్షికి కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. అత్త, మరిదికి భర్త కూడా తోడై కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. సాక్షి తల్లిదండ్రులు ఎన్నోసార్లు వారికి నచ్చచెప్పారు. తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే డబ్బులు ఇస్తామని చెప్పారు. అయినా వారి వేధింపులు ఆగలేదు. 


తల్లిదండ్రులు, భర్త కుటుంబ సభ్యుల మధ్య నలిగిపోయిన సాక్షి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మోనూ గజ్జర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అడిగినంత కట్నం ఇవ్వలేదనే కారణంతోనే మోనూ, అతడి కుటుంబ సభ్యుల తన కూతురిని హత్య చేశారని సాక్షి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. 

Updated Date - 2021-11-26T21:32:24+05:30 IST