విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-04-05T10:52:47+05:30 IST

కరోనా కోరలు చాస్తోంది.. పాలమూరు జిల్లాపై పడగ విప్పి బుస కొడుతున్నది.. ఐదు రోజుల కిందటి వరకు ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడంతో అంతా సద్దుమణుగుతుందన్న తరుణంలో ఒకటి, రెండు కేసులు నమోదు కావడం, ఆ మరుసటి రోజు నుంచే వరుసగా

విజృంభిస్తున్న కరోనా

చాపకింద నీరులా వ్యాపిస్తున్న కొవిడ్‌-19

పాలమూరులో ఏడుగురికి సోకిన వైరస్‌

ఒక కరోనా పాజిటివ్‌ వ్యక్తి డిశ్చార్జ్‌

మహబూబ్‌నగర్‌ పట్టణంలోనే ఐదు కేసులు

అందులో మర్కజ్‌కు లింకున్న కేసులు నాలుగు

సెకండ్‌ కాంటాక్ట్‌ వ్యక్తుల కోసం అధికారుల గాలింపు

ఆందోళనలో పట్టణ వాసులు


మహబూబ్‌నగర్‌, వైద్య విభాగం :

కరోనా కోరలు చాస్తోంది.. పాలమూరు జిల్లాపై పడగ విప్పి బుస కొడుతున్నది.. ఐదు రోజుల కిందటి వరకు ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడంతో అంతా సద్దుమణుగుతుందన్న తరుణంలో ఒకటి, రెండు కేసులు నమోదు కావడం, ఆ మరుసటి రోజు నుంచే వరుసగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.. ఇందులో మహబూబ్‌నగర్‌ పట్టణంలోనే ఐదు పాజిటివ్‌ కేసులు రావడంపై ప్రజల్లో భయాందోళన కలుగుతున్నది.. ఈ కేసుల్లో సెకండ్‌ కాంటాక్ట్స్‌లో ఇద్దరికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కావడం అందరిలో గుబులు పుట్టిస్తున్నది.. వెంటనే అప్పమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారి సెకండ్‌ కాంటాక్ట్స్‌ను వెతికే పనిలో పడింది..


కేసుల వివరాలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు శంషాబాద్‌ ఏయిర్‌పోర్టులో విధులు నిర్వహించిన వారికి సోకగా, ఒకటి కొడుకు నుంచి తల్లికి, మిగతా నాలుగు కేసులు ఢిల్లీలోని మర్కజ్‌కు చెందినవి. ఇందులో అత్యధికంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలోనే నమోదయ్యాయి. ఏడు కేసుల్లో ఒక పాజిటివ్‌ వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకొని, డిశ్చార్జ్‌ అయ్యాడు.


కరోనా వైరస్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. జిల్లాలో మొదటి రెండు కేసులు శంషాబాద్‌ ఏయిర్‌ పోర్టులో విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తులవి కావడం, అందులో ఒకరి తల్లికి కూడా వైరస్‌ సోకి మూడో పాజిటివ్‌ కేసుగా నమోదైంది. అందరినీ గాంధీ ఆసుపత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. అందరికీ నయమయ్యే క్రమంలోనే ఢిల్లీ మర్కజ్‌ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 34 మందిని గుర్తించగా, అందులో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది. ఆ ఇద్దరి వల్ల మరో ఇద్దరికి వైరస్‌ సోకింది. దీంతో ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో, జిల్లా ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నది.


మహబూబ్‌నగర్‌లోనే అత్యధికం

జిల్లాలో నమోదైన ఏడు పాజిటివ్‌ కేసుల్లో, నాలుగు కేసులు మర్కజ్‌కు లింకు ఉన్నవి. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి పట్టణంలోని సద్దలగుండు కాలనీతో పాటు మరికొన్ని చోట్ల కలియ తిరిగాడు. రామయ్యబౌలికి చెందిన మరో పాజిటివ్‌ వ్యక్తి కూడా అదే కాలనీలో దాదాపు 20 ఇళ్లు, కొన్ని ప్రార్థనా మందిరాలకు వెళ్లి వచ్చాడు. దీంతో వారి నుంచి ఇంకెంతమందికి సోకిందో తెలియడం లేదు.


కరోనా పాజిటివ్‌ వ్యక్తి డిశ్చార్జ్‌

భగీరథ కాలనీలోని మధురానగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణకు రావడంతో, అతన్ని గాంధీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. దాదాపు 15 రోజుల తర్వాత అతనికి వైరస్‌ పూర్తిగా తొలగిపోయింది. మళ్లీ పరీక్షలు చేసిన వైద్యులు కరోనా నెగెటివ్‌ రావడంతో శనివారం డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం అతను హౌజ్‌ ఐసొలేషన్‌లో ఆరోగ్యంగా ఉన్నాడు.


సెకండ్‌ కాంటాక్టు వ్యక్తుల కోనం గాలింపు

పట్టణంలోని రామయ్యబౌలి, సద్దలగుండు ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ రావడంతో, వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిద్దరు ఎవరెవరిని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు? అనే అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంటింటికీ వెళ్లి, ఆ ఇద్దరు పాజిటివ్‌ల సెకండ్‌ కాంటాక్టు వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు రామయ్యబౌలికి చెందిన పాజిటివ్‌ కేసుకు సంబంధించి 80 మంది సెకండ్‌ కాంటాక్టు వ్యక్తులను గుర్తించి, అందరినీ క్వారంటైన్‌ కేంద్రంలో పెట్టారు. సద్దలగుండు ప్రాంతంలో ఉత్తరాఖండ్‌కు చెందిన పాజిటివ్‌ వ్యక్తికి సంబంధించి దాదాపు 40 మంది సెకండ్‌ కాంటాక్ట్‌ ఉన్నట్లు గుర్తించారు. వీరందనిరీ ఎస్వీఎస్‌ ఆసుపత్రిలోని క్వారంటైన్‌కు పంపించారు.


కేసుల వివరాలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు శంషాబాద్‌ ఏయిర్‌పోర్టులో విధులు నిర్వహించిన వారికి సోకగా, ఒకటి కొడుకు నుంచి తల్లికి, మిగతా నాలుగు కేసులు ఢిల్లీలోని మర్కజ్‌కు చెందినవి. ఇందులో అత్యధికంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలోనే నమోదయ్యాయి. ఏడు కేసుల్లో ఒక పాజిటివ్‌ వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకొని, డిశ్చార్జ్‌ అయ్యాడు.

Updated Date - 2020-04-05T10:52:47+05:30 IST