ఊరేగింపులో ఉత్సాహంగా వరుడు.... ఇంతలో ఎదురైన మొదటి భార్య.... తరువాత!
ABN , First Publish Date - 2020-07-02T15:57:19+05:30 IST
సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఒక యువకుని వివాహవేడుకకు అక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి. వరుని ఇల్లు బంధువులతో కళకళలాడుతోంది. వరుడు ముస్తాబుకాగా, బంధువులంతా కల్యాణ వేదిక....
కాన్పూర్: సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఒక యువకుని వివాహవేడుకకు అక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి. వరుని ఇల్లు బంధువులతో కళకళలాడుతోంది. వరుడు ముస్తాబుకాగా, బంధువులంతా కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఆ వరుని మొదటి భార్య పోలీసులతో సహా ఎంట్రీ ఇచ్చింది. దీంతో అక్కడ హైవోల్టేజీ డ్రామా నడిచింది. ఆ యువకుడు తనను ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నాడని, తనను శారీరకంగా వేధింపులకు గురిచేశాడని, గర్భస్రావం కూడా చేయించాడని ఆమె ఆరోపించింది. మొదటి భార్య ఉండగా, రెండవ పెళ్లి ఎలా చేసుకుంటాడని నిలదీసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడిని పోలీస్స్టేషన్కు తరలించారు. పెళ్లి ఊరేగింపు ఆగిపోగా, పెళ్లికి వచ్చినవారంతా ఈ ఘటనతో విస్తుపోయారు. వివరాల్లోకి వెళితే యూపీలోని మంగళపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల లాల్జీ కా పూర్వా గ్రామంలో నివసిస్తున్న మన్వేంద్ర సింగ్ యాదవ్ సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. 2015లో మన్వేంద్ర సింగ్ ఒక యువతితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పరుచుకున్నాడు. 2018లో వారు ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మరో యువతితో మన్వేంద్రసింగ్ వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మన్వేంద్ర సింగ్ తొలి భార్య అతనిని పోలీసులకు రెడ్హ్యాండెడ్గా పట్టించింది.