ఫ్లైట్స్‌ సందడి

ABN , First Publish Date - 2020-05-27T08:37:19+05:30 IST

ఎట్టకేలకు విజయవాడ విమానాశ్రయానికి దేశీయ విమానాల రాకపోకలు మొదలయ్యాయి.

ఫ్లైట్స్‌ సందడి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ / గన్నవరం): ఎట్టకేలకు విజయవాడ విమానాశ్రయానికి దేశీయ విమానాల రాకపోకలు మొదలయ్యాయి. రెండు నెలలుగా బోసిపోయిన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రయాణికులతో సందడిగా కనిపించింది. మంగళవారం నాలుగు విమాన సర్వీసుల్లో దాదాపు 500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. బెంగళూరు నుంచి రెండు, చెన్నై, ఢిల్లీ నుంచి ఒక్కొక్కటి చొప్పున నాలుగు విమానాలు వచ్చాయి. అనుమతించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం రావలసిన ఏడు విమాన సర్వీసులు రాత్రి సమయంలో ఒక్కసారిగా రద్దు కావటంతో, మంగళవారమైనా తిరుగుతాయా లేదా అన్న సందేహం వ్యక్తమైంది. అయితే ప్రకటించిన షెడ్యూల్స్‌కు అదనంగా మరో విమాన సర్వీసు కూడా నడిచింది.


బెంగళూరు నుంచి ఇండిగోతో పాటు స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా సర్వీసును ప్రారంభించింది. ఉదయం 7-9 గంటల మధ్య రెండు బెంగళూరు విమానాలు విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యాయి. బెంగళూరు నుంచి వచ్చిన స్పైస్‌జెట్‌ విమానంలో 79 మంది ప్రయాణికులు  వచ్చారు. వారిలో  జిల్లాకు చెందిన వారు 32 మందిని గన్నవరం వెటర్నరీ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందినవారు 23 మంది, ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన వారు 24 మంది వచ్చారు. వీరిని ఆయా జిల్లాలకు ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సుల్లో తరలించారు. ఇదే విమానంలో బెంగళూరుకు 69 మంది ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నుంచి రెండో సర్వీసుగా వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో 49 మంది ప్రయాణికులు రాగా, ఇక్కడి నుంచి 48 మంది అదే విమానంలో బెంగళూరు వెళ్లారు.


ఇక్కడకు వచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు 16 మంది, గుంటూరు జిల్లాకు చెందిన వారు 12 మంది, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖజిల్లాకు చెందిన వారు 21 మంది చొప్పున వచ్చారు. వీరిని ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ఎస్కార్టు సాయంతో ఆయా జిల్లాల క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించారు. సాయంత్రం చెన్నై నుంచి వచ్చిన విమానంలో  28 మంది రాగా, ఇక్కడి నుంచి 21 మంది వెళ్లారు. రాత్రి ఢిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో 140 మంది రాగా, ఇక్కడి నుంచి 118 మంది ఢిల్లీ వెళ్లారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికుల రాకపోకలతో విమానాశ్రయం సందడిగా మారింది. 


నేడు ఐదు విమానాలు 

 విజయవాడ నుంచి నేడు ఐదు విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ఢిల్లీకి ఒకటి, కడపకు ఒకటి, బెంగళూరుకు మూడు సర్వీసులు చొప్పున రాకపోకలు సాగించనున్నాయి. చెన్నైకు కూడా సర్వీసు ఉన్నప్పటికీ ఈ సర్వీసుకు ఇంకా కన్ఫర్మేషన్‌ రాలేదు. 

Updated Date - 2020-05-27T08:37:19+05:30 IST