రెచ్చగొట్టేలా పోస్టులు.. యువతిపై కేసు
ABN , First Publish Date - 2021-08-04T08:21:31+05:30 IST
సోషల్ మీడియాలో రెండు గ్రూపులను రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్స్ పెట్టారని నమోదైన కేసులో సీఐడీ అధికారులు తెనాలిలో ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్రూపులు, రెండు కులాలను రెచ్చగొట్టే
ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదుతో అదుపులోకి రాత్రికి సీఐడీ కార్యాలయంలోనే
అధికారుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం
గుంటూరు, ఆగస్టు 3: సోషల్ మీడియాలో రెండు గ్రూపులను రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్స్ పెట్టారని నమోదైన కేసులో సీఐడీ అధికారులు తెనాలిలో ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్రూపులు, రెండు కులాలను రెచ్చగొట్టే విధంగా ఓ కులాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణను గుంటూరు సీఐడీ రీజినల్ కార్యాలయానికి దర్యాప్తు నిమిత్తం పంపారు. సీఐడీ సీఐ సంజీవ్కుమార్ కేసు విచారిస్తున్నారు. దీనిలో భాగంగా తెనాలికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలు బొలినేని జ్యోతిశ్రీని అధికారులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి తరలించారు. ఆమెను విచారించి సాయంత్రానికి స్టేషన్ బెయిల్పై విడుదల చేస్తారని భావించారు.
అయితే సాయంత్రం 6 గంటలు దాటినా జ్యోతిశ్రీని విడుదల చేయకపోవటంతో టీడీపీ నాయకులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని సంజీవ్కుమార్ను కలిసి వివరాలు అడిగారు. అప్పిరెడ్డి ఫిర్యాదు మేరకు 153ఎ, 120 రెడ్విడ్ 505(2) సెక్షన్ కింద సీఐడీ రాష్ట్ర కార్యాలయం కేసు నమోదు చేయటంతో జ్యోతిశ్రీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఆమెను బుధవారం ఉదయం కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతిశ్రీతో మాట్లాడించాలని కోరగా అనుమతించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంటలో పంపిస్తామని తీసుకువచ్చి రాత్రి వరకు నిర్బంధించారని తెలిపారు. తాను పార్టీపరంగా పోస్టింగ్స్ పెట్టానని, ఎవరినీ కించపరచలేదని, కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళను రాత్రి పూట సీఐడీ కార్యాలయంలో ఉంచడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.