కేంద్రం మొండి వైఖరిని విడనాడాలి
ABN , First Publish Date - 2021-09-19T05:32:18+05:30 IST
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి కోరారు.
వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి
కూర్మన్నపాలెం, సెప్టెంబరు 18: స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి కోరారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 219వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో కూర్చున్న ఎల్ఎంఎంఎం, డబ్యూఆర్ఎం కార్మికులనుద్దేశించి గౌతంరెడ్డి మాట్లాడుతూ మోదీ అన్న పేరు మోసానికి పర్యాయ పదంగా మారిందని ఆరోపించారు. విశాఖ ఉక్కును ఏ ప్రైవేటు సంస్థకు విక్రయించినా సహించేది లేదన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ గంగవరం పోర్టులోని రాష్ట్ర ప్రభుత్వ వాటాను ప్రైవేటుకు కట్టబెట్టడంతో ఉక్కు కర్మాగారంపై ఆర్థిక భారం పడుతున్నదన్నారు. జిల్లా వైఎస్సాఆర్టీయూసీ అధ్యక్షుడు బద్రీనాథ్, స్థానిక నాయకులు మంత్రి రాజశేఖర్, బొడ్డు పైడిరాజు, వరసాల శ్రీనివాస్, మురళీరాజు, గంధం వెంకటరావు, మస్తానప్ప, విళ్లా రామ్మోహన్ కుమార్, గంగవరం గోపి తదితరులు పాల్గొన్నారు.