సీఎం మాట నిలబెట్టుకున్నారు
ABN , First Publish Date - 2021-01-13T08:03:02+05:30 IST
హైదరాబాద్ బస్తీల్లోని ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం
బస్తీల్లో ఇకపై నల్లా బిల్లు లేకుండా తాగునీరు.. 9 లక్షల కుటుంబాలకు ఉచితం
ప్రభుత్వంపై 500 కోట్ల భారం.. సంక్షేమంలో పేదలకు స్వర్ణయుగం: కేటీఆర్
జీహెచ్ఎంసీలో ఉచిత నీటి పథకం ప్రారంభం.. ముందే సంక్రాంతి వచ్చిందన్న మంత్రి
హైదరాబాద్ సిటీ/కృష్ణానగర్ జనవరి 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ బస్తీల్లోని ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం డిసెంబరు నెల నుంచి నల్లా బిల్లు లేకుండా ఉచితంగా తాగునీరు ఇస్తున్నారని తెలిపారు. ఇందుకు ప్రభుత్వంపై నాలుగైదు వందల కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందని, అయినా.. పేద ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మొత్తం డబ్బును ప్రభుత్వమే వాటర్ బోర్డుకు చెలిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో గృహ కనెక్షన్లకు, అపార్ట్మెంట్లలోని కుటుంబాలకు నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కేటీఆర్ మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎస్పీఆర్ హిల్స్లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి జీరో నీటి బిల్లులను అందజేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ఉచిత తాగునీటి పథకం ప్రారంభం ద్వారా నగర ప్రజలకు సంక్రాంతి పండుగ రెండు రోజుల ముందే వచ్చినట్లయిందన్నారు. నగరంలో దాదాపు 9లక్షల కుటుంబాలకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం సుదూర ప్రాంతంలో ఉన్న గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని వాటర్ బోర్డు తరలిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇబ్బంది కలగకుండా కేశవాపురం ప్రాజెక్టుతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు వెంట రింగ్ మెయిన్ ప్రాజెక్టును చేపట్టి కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేయనున్నామని వెల్లడించారు. దీంతో నగరంలో 2048 వరకు తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదన్నారు.
సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను ఆపలేదు
కరోనా సంక్షోభ సమయంలో కూడా రాష్ట్రంలో సంక్షే మ పథకాలను ఆపలేదని, అభివృద్ధి పనులు ఆగలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమంలో ఇది పేదలకు స్వర్ణయుగమన్నారు. ఆరున్నరేళ్లలో ఒక్క పైసా కూడా పన్నులు పెంచకుండా.. కార్యదక్షత, సమర్థతతో ఆదాయాన్ని పెంచుతూ, ప్రజలకు పంచుతూ ప్రభుత్వం ముందుకెళుతోందని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా చాలా వాగ్దానాలు చేస్తాయని, కానీ.. చెప్పింది చేసే సీఎం మాత్రం కేసీఆరేనని అన్నారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లుగా కొందరు అవాకులు, చవాకులు పేలుతున్నారని, ధైర్యముంటే తమలాగా చేసి చూపించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కేపీ వివేకానంద, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.