ప్రాజెక్టులను నిర్మించి రైతులను అదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది
ABN , First Publish Date - 2020-05-22T10:17:25+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టినవేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి
తిమ్మాపూర్, మే 21: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టినవేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూర్లో గురువారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రేవంత్రెడ్డి అలుగునూర్లో అగి రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలం కలిసి వచ్చి వర్షాలు కురవడంతో కాంగ్రెస్ హయంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో, చెరువుల్లో నీరు నిండాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని రైతులు కష్టపడి పండించుకుంటే అంతా తమ వల్లే పండిందంటూ టీఆర్ఎస్ నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ దేశసేవ చేస్తూ ప్రాణాలు వదిలారన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.