కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ABN , First Publish Date - 2021-06-04T05:09:43+05:30 IST
కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించి, మృతులకు రూ.పది లక్షల వంతున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఇఫ్టూ డిమాండ్ చేసింది.
నెల్లిమర్ల, జూన్ 3: కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించి, మృతులకు రూ.పది లక్షల వంతున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఇఫ్టూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇఫ్టూ రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాన్ని ఆ సంఘం స్థానిక నాయకుడు పి.మల్లిక్ జరజాపుపేటలో గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలను జాతీయం చేసి అందరికీ ఉచితంగా అందించాలని, ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని కొవిడ్కి ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలని కోరారు. ఇఫ్టూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 7 నుంచి 13 వరకు డిమాండ్లపై ప్రచార కార్యక్రమం, జూన్ 14 నుంచి ప్రజలు, కార్మికులనుంచి సంతకాల సేకరణ, జూన్ 21న సచివాలయాలు, తహసీల్దార్లకు వినతి పత్రాల సమర్పణ, 28న ధర్నాలు, జూలై 4న సీఎంకు సంతకాల పత్రాల అందజేత తదితర కార్యక్రమాలకు నిర్ణయించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ నాయకులు నామాల తిరుపతిరావు, మద్దిల రాము, కాళ్ల అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు.