ఇద్దరు పిల్లలున్న తండ్రి తొమ్మిదో తరగతి అమ్మాయితో ప్రేమాయణం..అసలు జరిగిన కథ ఇదీ..!

ABN , First Publish Date - 2021-11-17T04:38:39+05:30 IST

ఆ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి..

ఇద్దరు పిల్లలున్న తండ్రి తొమ్మిదో తరగతి అమ్మాయితో ప్రేమాయణం..అసలు జరిగిన కథ ఇదీ..!
అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

మైనర్‌తో వివాహితుడి ప్రేమవ్యవహారం 

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట బస్టాండ్‌లో ఘటన

మృతులది చంద్రుగొండ మండలం సీతాయిగూడెం

ప్రేమజంట ఆత్మహత్య 


ఖమ్మం/అశ్వారావుపేట: ఆ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరి ఆత్మహత్యకు కారణమైంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంగళవారం జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడేనికి చెందిన పోరళ్ల జగ్గారావు(28).. అదే గ్రామానికి చెందిన బాలిక(14)ను అపహరించుకుపోయినట్టు బాలిక తండ్రి నుంచి గత సోమవారమే చంద్రుగొండ పోలీసులకు ఫిర్యాదు అందింది. దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సీతాయిగూడేనికి చెందిన జగ్గారావు వరికోత మిషన్లను లీజుకు తీసుకొచ్చి గ్రామంలో నిర్వహిస్తుంటాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.  అయితే జగ్గారావు తన ఇంటి సమీపంలోనే ఉంటున్న తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికను తరచూ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద దించే వాడు. ఈక్రమంలో వారిద్దరి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు తల్లితండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో బాలిక తండ్రి అదేరోజు చండ్రుగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి.. జగ్గారావుపై అనుమానం ఉన్నట్లు తెలపడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.


సోమవారం ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా జగ్గారావు విజయవాడ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. కానీ మంగళవారం ఉదయం వీరిద్దరూ అశ్వారావుపేటకు వచ్చారని, ఉదయం నుంచి చాలాసేపు అశ్వారావుపేట బస్టాండులోనే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. మధ్యాహ్నం వీరిద్దరు బస్టాండ్‌లోనే పురుగుల మందు తాగి పాల్వంచ వెళ్లే బస్సు ఎక్కగా బస్సు బయలుదేరే సమయానికి వీరి పరిస్థితి విషమించి వాంతులు చేసుకొని అపస్మారక స్థితికి చేరుకోవడంతో డ్రైవర్‌ బస్సును పోలీస్‌స్టేషన్‌కు వద్దకు తీసుకెళ్లాడు. వారిని అక్కడినుంచి అంబులెన్స్‌లో అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తుండగా ఇద్దరూ మృతి చెందారు. ప్రియుడు జగ్గారావు జేబులో మంగళసూత్రం కూడా ఉంది. వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి అశ్వారావుపేట ఎస్‌ఐ అరుణ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ముగ్గురు మహిళలను ప్రేమపేరుతో లోబరచుకున్న ఘటనలపై జగ్గారావుపై గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-11-17T04:38:39+05:30 IST