జంట హత్యల కేసులో దోషులను అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2021-08-02T07:58:24+05:30 IST
‘‘కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో గత జూన్ 17న ఇద్దరు సోదరులను హతమార్చిన ఘటనలో దోషులను తక్షణమే అరెస్టు చేయాలి.
డీజీపీకి చంద్రబాబు లేఖ
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ‘‘కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో గత జూన్ 17న ఇద్దరు సోదరులను హతమార్చిన ఘటనలో దోషులను తక్షణమే అరెస్టు చేయాలి. ఫిర్యాదీదారులకు, సాక్షులకు, వారి కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాలి’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం డీజీపీకి ఓ లేఖ రాశారు. ‘‘ఇద్దరు సోదరులైన వడ్డు నాగేశ్వరరెడ్డి, వడ్డు ప్రతాపరెడ్డిని స్థానిక వైసీపీ గూండాలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై అదే రోజు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. పక్కా సాక్ష్యాలు ఉన్నప్పటికీ దోషులు నిర్భయంగా బయట తిరుగుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను, సాక్షులను దోషులు ఫోన్లో బెదిరిస్తున్నారు. భౌతిక దాడులకూ దిగుతున్నారు. దోషులు ఒక వర్గం పోలీసులతో కుమ్మక్కయ్యారు. బాధితుల కుటుంబ సభ్యులు, సాక్షుల ప్రాణాలకు, ఆస్తికి ముప్పు కలించాలని చూస్తున్నారు’’ అని చంద్రబాబు తన లేఖలో వివరించారు.
ఉపాధి బిల్లుల కోసం నేడు టీడీపీ వినతులు
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పెండింగ్ ఉపాధి బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం 175 నియోజకవర్గాల్లో ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు టీడీపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.