దళితుడిని సీఎం చేయాలి
ABN , First Publish Date - 2022-02-15T05:28:24+05:30 IST
దళితుల బాగు కోసమే రాజ్యాంగం మార్పు కోరితే.. ముందు దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు జితేందర్రెడ్డి అన్నారు.
- రాజ్యాంగాన్ని అవమానపరిచిన సీఎంను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి
- మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు జితేందర్రెడ్డి
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 14: దళితుల బాగు కోసమే రాజ్యాంగం మార్పు కోరితే.. ముందు దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు జితేందర్రెడ్డి అన్నారు. సోమవారం నగరంలో జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన బహుజన వర్గాల ప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాల నేతల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజ్యాంగం మార్పుపై కేసీఆర్ తన వాఖ్యలను సమర్థించుకునే ముందుకు గతంలో ఇచ్చిన హామీ మేరకు మూడెకరాల భూపంపిణీ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ను తెలంగాణ నుంచి తరిమికొట్టడానికి బడుగు బలహీనవర్గాల ప్రజానీకం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని వాఖ్యానించడమంటే అంబేద్కర్ను అవమానపరుచడమేనని అన్నారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతోపాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళితబంధు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్లు శివరామకృష్ణయ్య, రాంగోపాల్రెడ్డి, జనపట్ల స్వామి, గాజె రమేశ్, ఎన్నం ప్రకాశ్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.