దిగజారుతోన్న గంగ
ABN , First Publish Date - 2021-10-18T05:44:17+05:30 IST
జిల్లాలో భూగర్భ జలం రోజురోజుకూ పడిపోతోంది. మూడు నెలల్లో సగటున 0.75 మీటర్ల మేర దిగజారింది. కందుకూరు, ఒంగోలు డివిజన్లలో పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో గొంతెండకుండా ఉండాలంటే నీటి పొదుపు కోసం యంత్రాంగం సమగ్ర ప్రణాళికలను రూపొందించడంతో పాటు, ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది.
అడుగంటుతున్న భూగర్భ జలం
మూడు నెలల్లో సరాసరి
0.75 మీటర్ల దిగువకు పడిపోయిన వైనం
నీటిని పొదుపుగా వాడుకోవడమే పరిష్కారం
ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 17 : జిల్లాలో భూగర్భ జలం రోజురోజుకూ పడిపోతోంది. మూడు నెలల్లో సగటున 0.75 మీటర్ల మేర దిగజారింది. కందుకూరు, ఒంగోలు డివిజన్లలో పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో గొంతెండకుండా ఉండాలంటే నీటి పొదుపు కోసం యంత్రాంగం సమగ్ర ప్రణాళికలను రూపొందించడంతో పాటు, ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది.
జూలై నుంచి ప్రతి నెలా తగ్గుదల
గతేడాది కురిసిన భారీ వర్షాలకు గంగమ్మ ఉబికి పైకి వచ్చింది. గత డిసెంబరు నాటికి జిల్లావ్యాప్తంగా భూగర్భ జలంలో సగటున 6.60 మీటర్ల వరకూ పెరుగుదల నమోదైంది. మళ్లీ ఈ సంవత్సరం జూలై నుంచి ప్రతి నెలా తగ్గుదలే నమోదవుతోంది. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది మెరుగ్గానే ఉన్పప్పటికీ గత మూడునెలల భూగర్భ జలాల సగటు ఆందోళన కలిగిస్తోంది. కందుకూరు డివిజన్లో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో జిల్లా సగటు కన్నా అక్కడ మరింత దిగువకు గంగమ్మ పడిపోయింది. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని అధికారులు చెబుతున్నారు.
కందుకూరు, ఒంగోలు డివిజన్లలో అధికం
గత సంవత్సరం డిసెంబరు నాటికి జిల్లాలో సగటున 6.60మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. డివిజన్ల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా మార్కాపురం డివిజన్లో 10 నుంచి 15 మీటర్ల వరకూ పైకి వచ్చాయి. కందుకూరు డివిజన్లో 8 మీటర్లు, అత్యల్పంగా ఒంగోలు డివిజన్లో 4 మీటర్ల మేర భూగర్భ జలాల్లో వృద్ధి నమోదైంది. ప్రస్తుతం జిల్లాలో సగటున 0.75 మీటర్ల మేర దిగువకు జలాలు పడిపోయాయి. ఈ సగటు కందుకూరు డివిజన్లో 1.50 మీటర్ల వరకూ ఉంది. ఒంగోలు డివిజన్లో 1.80మీటర్ల మేర జలాలు పడిపోయినట్లు యంత్రాంగం అంచనా వేసింది.
నీటి పొదుపే కీలకం
భవిష్యత్తులో జిల్లాకు పొంచి ఉన్న నీటిముప్పును ఎదుర్కోవాలంటే పొదుపుగా వాడుకోవడం ఒక్కటే పరిష్కారం. అంతేకాకుండా ఇంకుడు గుంతలపై జ్రలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. క్రమం తప్పకుండా భూగర్భ జలాల సర్వే చేపట్టి ప్రమాదకర స్థాయిలో పడిపోతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ చేపడితేనే గంగమ్మ అందుబాటులో ఉంటుంది. లేకుంటే నీటి కష్టాలు తప్పవు.