వివేకా హత్య వెనుక లోతైన కుట్ర!
ABN , First Publish Date - 2021-01-16T08:59:03+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక కొందరి హస్తం గురించి తనకు కచ్చితమైన అనుమానాలున్నాయని కేరళకు చెందిన ప్రముఖ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ అన్నారు. హత్య వెనుక లోతైన కుట్ర ఉందన్నారు. రెండు నెలల్లో విలేకరుల సమావేశం నిర్వహించి...
2 నెలల్లో ఆధారాలన్నీ బయటపెడతా
హంతకులకు శిక్ష పడేలా చేస్తా
కొందరి పాత్రపై అనుమానాలు
ఇప్పుడే చెప్పడం మంచిది కాదు
‘ఆంధ్రజ్యోతి’తో కేరళ హక్కుల కార్యకర్త జోమున్
ఆయనతో వివేకా కుమార్తె సునీతారెడ్డి భేటీ
న్యూఢిల్లీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక కొందరి హస్తం గురించి తనకు కచ్చితమైన అనుమానాలున్నాయని కేరళకు చెందిన ప్రముఖ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ అన్నారు. హత్య వెనుక లోతైన కుట్ర ఉందన్నారు. రెండు నెలల్లో విలేకరుల సమావేశం నిర్వహించి... మొత్తం సాక్ష్యాధారాలు బయటపెడతామని ప్రకటించారు.
అనుమానితుల విషయంలో ఇప్పుడే మాట్లాడడం మంచిది కాదని చెప్పారు. కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో తీవ్రంగా పోరాడి.. ఆమెపై జరిగిన దారుణానికి సంబంధించి సీబీఐ సాక్ష్యాధారాలు సంపాదించడంలో జోమున్ కీలక పాత్ర పోషించారు. శుక్రవారం ఆయన కొట్టాయం నుంచి ఢిల్లీలోని ‘ఆంధ్ర జ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. మూడు రోజుల క్రితం తనను వివేకా కుమార్తె సునీతారెడ్డి కలిశారని.. సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. సీబీఐ దర్యాప్తు విషయంలో ఆమెకు ఏ విధంగా సహాయం చేయాలి.. సాక్ష్యాధారాల సేకరణలో దర్యాప్తు సంస్థకు ఎలా తోడ్పడాలన్న విషయమై చర్చించామని చెప్పారు. వివేకా కేసులో కూడా హంతకులకు శిక్షపడేలా చేస్తానన్నారు.
నాడు నా హత్యకు యత్నం..
సిస్టర్ అభయ విషయంలో పోలీసులు ప్రజలను తప్పుదోవ పట్టించి.. ఆమెది ఆత్మహత్యగా చెప్పి కేసును మూసేయించారని.. దీని వెనుక చర్చి కీలక పాత్ర పోషించిందని జోమున్ తెలిపారు. దీనిపై ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, సాక్ష్యాధారాలు సేకరించేలా చేశానన్నారు. చర్చి ఫాదర్ తన సోదరుడితోనే తనను హత్య చేయించేందుకు ప్రయత్నిస్తే.. గాయాలతో బయటపడ్డానని చెప్పారు. చివరకు చర్చి ఫాదర్, నన్ కలిసి ఆమెను చంపారన్న విషయాన్ని సీబీఐ కోర్టు నిర్ధారించిందని తెలిపారు.