ఆర్టీసీ ప్రయాణికుల వివరాలు చెప్పాల్సిందే
ABN , First Publish Date - 2020-06-05T11:14:28+05:30 IST
కొవిడ్-19 నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు బస్సెక్కడానికి ముందే తమ వివరాలను ఆర్టీసీ సిబ్బందికి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుందని ఆర్ఎం ఆర్వీఎస్..
రిజర్వేషన్ టిక్కెట్లకు సాఫ్ట్వేర్లోనే మార్పులు
రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 4: కొవిడ్-19 నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు బస్సెక్కడానికి ముందే తమ వివరాలను ఆర్టీసీ సిబ్బందికి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుందని ఆర్ఎం ఆర్వీఎస్ నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని బస్ కాంప్లెక్స్ల వద్ద ప్రయాణికుల వివరాలు నమోదు చేస్తున్నామని, దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని తెలిపారు.
ప్రయాణికుని పేరు, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు వివరాలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల ప్రయాణంలో కొంత ఆలస్యం జరిగినా ముందు జాగ్రత్తగా ప్రయాణికుల వివరాలు తీసుకుంటున్నామన్నారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారు వివరాలను ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆన్లైన్ రిజర్వేషన్ సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్టు వివరించారు. ప్రయాణికులు మార్పులను గమనించి సహకరించాలని కోరారు.