జిల్లాలో ‘పీకే’ మాఫియా

ABN , First Publish Date - 2020-06-05T10:35:02+05:30 IST

జిల్లాలో పోలుబోయిన, కోటం(పీకే) మాఫియా..

జిల్లాలో ‘పీకే’ మాఫియా

పోలుబోయిన.. కోటం(పీకే) కనుసన్నల్లోనే అక్రమాలు

హైకోర్టును ఆశ్రయిస్తున్నా: టీడీపీ నేత ఆనం


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో పోలుబోయిన, కోటం(పీకే) మాఫియా రాజ్యమేలుతోందని, వారి కనుసన్నల్లోనే ఇసుక, గ్రావెల్‌ అనధికార తవ్వకాలు జరుగుతున్నాయని, రూ.కోట్లలో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరులో సామాన్యులు ఇల్లు కట్టుకునేందుకు ఇసుక దొరకడం లేదుగానీ... చెన్నై, బెంగళూరు నగరాలకు మాత్రం యథేచ్ఛగా తరలిపోతోందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంచేందుకు అక్కచెరువుపాడు, వెంకటేశ్వరపురంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఉపయోగించిన ఇసుక, గ్రావెల్‌కు సంబంధించి ఒక్క వేబిల్లు అయినా చూపించాలని డిమాండ్‌ చేశారు.


ఆ పనుల్లో పీకే మాఫియా రూ.కోట్లు సంపాదించుకుందని ఆరోపించారు. అక్కచెరువుపాడులో స్థలాల చదునుకు పక్కనే ఉన్న అసైన్డ్‌ భూముల్లో ఆరు అడుగుల లోతున గ్రావెల్‌ తవ్వకాలు జరిపారంటూ ఫొటోలు చూపారు. అలా తవ్విన భూముల్లోనూ పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని, దీంతో ఆ గుంతలను పూడ్చేందుకు రూ.కోట్ల టెండర్లు సైతం పీకే మాఫియాకు వెళతాయని విమర్శించారు. వెంకటేశ్వరపురంలోనూ పెన్నానదిలో ఇసుక తవ్వకాలతో పీకే మాఫియా దాదాపు రూ.7కోట్ల వరకు సంపాదించుకుందని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.30 కోట్లతో చేపట్టిన పనులు అంతా నాశిరకంగా జరుగుతున్నాయన్నారు.


వీటిపై సీఎం నుంచి కమిషనర్‌ వరకు ఎవరికి ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. కనీసం ఫిర్యాదుకు స్పందించి పరిశీలన కూడా చేయించలేని పరిస్థితిలో కలెక్టర్‌ ఉన్నారని విమర్శించారు. ఇక కమిషనర్‌ అయితే ఫిర్యాదు తీసుకోవడానికీ వణికిపోతున్నారన్నారు. వీటిపై హైకోర్టును ఆశ్రయిస్తున్నానని తెలిపారు. మంత్రి అనిల్‌ నీతిమంతుడైతే వీటన్నింటిపై విచారణ జరిపించాలని, తాను తప్పుడు ఆరోపణలు చేసినట్లు తేలితే క్షమాపణలు చెబుతానని ఆనం పేర్కొన్నారు.

Updated Date - 2020-06-05T10:35:02+05:30 IST