ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-10-28T03:29:24+05:30 IST
ఓటరు జాబితా సవరణ కార్యక్రమం 2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1వ తేదీన జిల్లాలో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 27: ఓటరు జాబితా సవరణ కార్యక్రమం 2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1వ తేదీన జిల్లాలో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం కలెక్టర్, అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 30వ తేదీ వరకు వచ్చిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. నవంబర్ 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఓటర్ల జాబితాలో ఏమైనా మార్పులు, చేర్పులు ఇతర సమస్యలుంటే దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 2వ తేదీ నుంచి సరిచేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. అదనపు పోలింగ్ కేంద్రాలు అవసరం ఉన్న ప్రాంతాల్లో స్ధానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి ఆమోదంతో మార్పులకు సిఫారసు చేయాలన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటర్ల వివరాలు, మార్పులు చేర్పులు చేసుకునేందుకు ప్రభుత్వం గరుడ యాప్ను అందుబాటులోకి తెచ్చిం దన్నారు. గత ఎన్నికలకు సంబంధించి ఖర్చు చేసిన ఎన్నికల బిల్లులు, డీసీ బిల్లుల సమర్పణలో పెండింగ్ ఉంటే సత్వరమే దాఖలు చేయాలన్నారు. కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో ఓట రు నమోదు, మార్పులు, చేర్పులు తొలగింపులపై ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని చెప్పారు. అలాగే ఈవీఎంల భద్రతపై గోదాముల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించామని తెలిపారు. నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్నాయక్, మంచిర్యాల ఆర్డీవో వేణు పాల్గొన్నారు.