ఉపనిషత్తుల సారం.. భగవద్గీత

ABN , First Publish Date - 2020-12-24T09:56:43+05:30 IST

‘‘సామగానములలో నేను బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, చైత్రాది పన్నెండు నెలల్లో మార్గశీర్ష మాసాన్ని, ఆరు రుతువులలో వసంత రుతువును’’ అని ఆ పరమాత్మ ‘భగవద్గీత’లోని విభూతి యోగంలో తెలిపాడు

ఉపనిషత్తుల సారం.. భగవద్గీత

బృహత్సామ తథా సామ్నాం

గాయత్రీ ఛందసామహం

మాసానాం మార్గశీర్షోహమ్‌

ఋతూనాం కుసుమాకరః


‘‘సామగానములలో నేను బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, చైత్రాది పన్నెండు నెలల్లో మార్గశీర్ష మాసాన్ని, ఆరు రుతువులలో వసంత రుతువును’’ అని ఆ పరమాత్మ ‘భగవద్గీత’లోని విభూతి యోగంలో తెలిపాడు. కనుక మార్గశిర మాసం సాక్షాత్తూ విష్ణుస్వరూపమే. ఆ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి కార్తిక అమవాస్యనాడు ఏకాంతంగా బోధించిన భగవద్గీతను.. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుని ముఖతః దృతరాష్ట్రుడు విన్నాడు. అందుకే ఆరోజును గీతా జయంతిగా వ్యవహరిస్తారు. మార్గశిర మాసాన్ని మహా భారత కాలంలో ప్రథమ మాసంగా పరిగణించేవారు. ఈ మాసము దేవతలకు ఉషఃకాలము. కొతగా పంటలు పండే సమయం. ఆ విధంగా కూడా ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.


కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్‌ శతగ్‌ం సమాః

ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే


..అని ఈశావాస్యోపనిషత్‌ చెబుతుంది. ముముక్షువైనవాడు ఈ లోకంలో వేదవిహితాలైన కర్మలను ఆచరిస్తూ నూరేళ్లు జీవించాలి. కానీ.. ఆ కర్మల ఫలితాన్ని మాత్రం ఈశ్వరుడికి అర్పించాలి. అప్పుడే అతడు కర్మబంధముల నుండి విడివడి ముక్తుడు కాగలడని దీని భావము. అటువంటి పవిత్రమైన మోక్షమార్గాన్ని విశదీకరించే ఉపనిషత్తుల సారమే ’భగవద్గీత’.  కనుక ప్రారబ్దాన్ని అనుభవిస్తున్నప్పటికీ.. ఎల్లప్పుడూ గీతను అభ్యసించేవారు ముక్తిని పొంది ఈ లోకంలో సుఖిస్తారు. వారికి ఏ కర్మలూ అంటవు. ఎక్కడ గీతాపద్యం, శ్రవణాలు జరుగుతాయో అక్కడ నారదాదిమునులు, ప్రయోగాదితీర్థాలు వసించుచుండును. గీత నిత్యమైనది, చిదానంద స్వరూపమని ‘గీతామహత్యము’ తెలుపుతోంది. ‘గీత‘ అను రెండు అక్షరములలో ‘గీ‘ అను అక్షరము త్యాగమును బోధిస్తుండగా.. ’త‘ అనే అక్షరము తత్వబోధనుపదేశించుచున్నదని.. ముముక్షువుల మాట. కనుకనే ‘భగవద్గీత’ సర్వోపనిషత్సారమైన గ్రంథమై విరాజిల్లుతోంది.

- మేఘశ్యామ (ఈమని), 8332931376(రేపు ‘గీతా జయంతి’)

Updated Date - 2020-12-24T09:56:43+05:30 IST