దళితుల బహిష్కరణ ఆటవికం
ABN , First Publish Date - 2021-10-22T05:52:50+05:30 IST
సిద్దిపేట ప్రాంతంలో దళితులపై దాడులు, సాంఘిక బహిష్కరణ చేయడం ఆటవికమని నిజ నిర్ధారణ బృందం నేతలు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, పీడీఎ్సయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు.
దళిత బహుజన ఫ్రంట్, పీడీఎస్యూ నాయకులు
సిద్దిపేట రూరల్, అక్టోబరు 21: సిద్దిపేట ప్రాంతంలో దళితులపై దాడులు, సాంఘిక బహిష్కరణ చేయడం ఆటవికమని నిజ నిర్ధారణ బృందం నేతలు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, పీడీఎ్సయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు. దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన పెద్ద లింగారెడ్డిపల్లిలో గురువారం వారు పర్యటించి దళితులతో సమావేశమై బహిష్కరణ వివరాలను తెలుసుకున్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, ఏసీపీ విచారణ చేసినందున నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, జిల్లా పోలీసు కమిషనర్ గ్రామాన్ని సందర్శించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో డీబీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బీమ్ శేఖర్, పీడీఎ్సయూ జిల్లా సహాయ కార్యదర్శి విద్యానాథ్, మాల మహానాడు నాయకులు కొదాది శ్రీనివాస్, యాదగిరి, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
ముద్దాపూర్లో దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలి
గజ్వేల్, అక్టోబరు 21: కొండపాక మండలం ముద్దాపూర్లో దళితులపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ గజ్వేల్ ఏసీపీ మడత రమేశ్కు డీబీఎఫ్ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పెద్దలింగన్నగారి శంకర్ మాట్లాడుతూ.. ఇప్పటికే అట్రాసిటీ కేసును చేశారని, ప్రధాన నిందితుల పేర్లను అందులో చేర్చాలని కోరారు. దాడి సమయంలో నిందితులు లాక్కున్న బంగారు గొలుసు, రూ.50వేల విలువైన స్మార్ట్ఫోన్ను బాధితులకు ఇప్పించి, న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు ఏసీపీ సానుకూలంగా స్పందించారని శంకర్ తెలిపారు. ఆయన వెంట డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు ఉన్నారు.