వాస్తవాలు గ్రహించాలి!

ABN , First Publish Date - 2020-04-10T08:24:46+05:30 IST

ఈ దేశంలో మతం అనేది మనిషిని వదలనంతగా మన జీవితాలతో ముడివేసుకొని పోయింది. ఆయా మతస్థులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏమాత్రం మార్పు లేకుండా, మార్చుకోవడానికి వీలు...

వాస్తవాలు గ్రహించాలి!

దయచేసి అందరూ, ముఖ్యంగా ముస్లింలు, రోజువారీ సమాజాన్ని గమనించండి. తెలుసుకోండి. వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధికారులు ఇస్తున్న సూచనలను గమనించండి. ప్రభుత్వాదేశాలను, సూచనలను అనుసరించండి. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని అనుసరించండి. ముస్లింలతోపాటు మిగతావారూ భావోద్వేగాలను విడనాడి నిజా నిజాలు గ్రహించాలని కోరుతున్నాం.


ఈ దేశంలో మతం అనేది మనిషిని వదలనంతగా మన జీవితాలతో ముడివేసుకొని పోయింది. ఆయా మతస్థులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏమాత్రం మార్పు లేకుండా, మార్చుకోవడానికి వీలు లేకుండా తమ మతాన్ని సాధారణ జనంపై రుద్దుతూనే ఉన్నారు. ఈ ధోరణి అన్ని మతాల్లోనూ ఉన్నప్పటికినీ ఇస్లాం మతంలోని ‘తబ్లిఖ్‌ జమాత్‌’ వారు మరికొంత సాంప్రదాయులు. ప్రాపంచిక వ్యవహారాలపై దృష్టి పెట్టరు. సామాజిక మార్పులను పట్టించుకోరు. అల్లాహ్‌ బోధనలను తూచా తప్పకుండా పాటించాలని, నమాజ్‌ను, తదితర నియమాలను అనుసరించాలని బోధనలు చేస్తుంటారు. ప్రపంచ ముస్లింలలో వీరిని అనుసరించేవారు కోట్ల సంఖ్యలో ఉన్నట్లుగానే వీరి వాదనలు, బోధనలు అంగీకరించనివారు, అనుసరించనివారు అంతకు అనేక రెట్లు ఉన్నారు. ఇస్లాం మతంలోని వివిధ జమాతులను అనుసరించేవారు గమనించవల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దేశ రాజ్యాంగానికి లోబడే తమకు హక్కులు కల్పించబడ్డాయని, ఆ మేరకు పౌరులుగా తమందరిపై బాధ్యతలుంటాయని గ్రహించాలి. సైన్స్‌ సాధించిపెట్టిన ఆధునిక వసతులను, సదుపాయాలను, సౌకర్యాలను అనుభవిస్తున్నట్లుగానే మారుతున్న ప్రాపంచిక పరిస్థితుల్ని పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయాలను జమాతుల ద్వారానే సాధారణ ముస్లింలకు చేరవేయాలి. ఎందుకంటే ఈ జమాతుల ప్రభావం వీరిపైనే ఎక్కువగా ఉంటుందని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయి.


ముస్లింలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విభజన రేఖలు గీస్తున్న వర్గం ఇప్పటికే నిజా మొద్దీన్‌ సభ విషయంలో అనేక అసత్యాలను ప్రచారంలోకి తెచ్చింది. భారతీయులను నాశనం చేయడానికే ముస్లింలు సభ నిర్వహించారని ప్రచారాలు చేస్తున్నారు. అదే నిజమైతే ఆ సభకు వెళ్లొచ్చినవారు మజీదులకో, తమ ఇళ్లకో ఎందుకు వెళ్తారు? కుటుంబ సభ్యులకే కరోనా అంటించరు కదా! ముస్లింలనే టార్గెట్ చేసే పైవర్గంతోపాటు మీడియా కూడా బాధ్యతారాహిత్యంగా విషం చిమ్మడం చూస్తు న్నాం! WHO సూచనలను అనుసరించి విదేశీ యుల రాక పోకలను కట్టడిచేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. నిజా మొద్దీన్ సభ మీదే దృష్టి కేంద్రీకరించి, దాదాపు 55 వేల మంది గడిచిన నెల రోజుల్లో విదేశాల నుంచి భారతదేశానికి వచ్చారనే విషయాన్ని విస్మరిస్తున్నామేమో!


నిజామొద్దీన్‌ సభకు వెళ్లి వచ్చిన జమాత్‌ సభ్యులారా! మీ కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వాలు, పోలీసులు, వైద్యులకు సహకరించండి. లేదంటే మొత్తం ముస్లిం సమాజం నింద మోయాల్సి వస్తున్నది. మతం పేరిట ఆధునిక రాజకీయ, సామాజిక, వైద్య విధానాలను, అభివృద్ధిని విస్మరించడాన్ని మేం సమర్థించం. అలా విస్మరిస్తే ఒక్క ఇస్లాం సమాజానికే కాదు, సహ సమాజం అంతటికి హాని చేసినవారవుతారు. దయచేసి అందరూ, ముఖ్యంగా ముస్లింలు రోజువారీ సమాజాన్ని గమనించండి. తెలుసుకోండి. వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధికారులు ఇస్తున్న సూచనలను గమనించండి. ప్రభుత్వాదేశాలను, సూచనలను అనుసరించండి. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని అనుసరించండి. ముస్లింలతోపాటు మిగతావారూ భావోద్వేగాలను విడనాడి నిజానిజాలు గ్రహించాలని కోరుతున్నాం.


ఖాజా, డా.రియాజ్‌ మహమ్మద్‌, వహీద్ మహమ్మద్, సయ్యద్‌ ఖుర్షీద్‌, నబి కరీమ్ ఖాన్ (ఒంగోలు), నస్రీన్ ఖాన్, డా.అఫ్సర్, ఎస్.పి.గఫార్, స్కైబాబ, ఎస్.పి.మహమూద్, షఫీ షేక్, షేక్ మస్తాన్ వలి (కడప), ఇనాయతుల్లా (కర్నూలు), డా.మహమ్మద్ రఫీ, అక్బర్ (ఆర్టిస్ట్), నిసార్ (వాగ్గేయకారులు)       r ముస్లిం థింకర్స్ డయాస్

Updated Date - 2020-04-10T08:24:46+05:30 IST