సీమ లిఫ్టునకు తొలి అడుగు
ABN , First Publish Date - 2020-08-14T09:45:57+05:30 IST
కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో వాడుకోడానికి ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తొలి అ
జ్యుడిషియల్ ప్రివ్యూకు టెండరు డాక్యుమెంట్
కర్నూలు(అగ్రికల్చర్), ఆగస్టు 13: కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో వాడుకోడానికి ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు కాంట్రాక్టు టెండరు డాక్యుమెంట్ను జుడీషియల్ ప్రివ్యూకు బుధవారం పంపినట్లు శ్రీశైలం డ్యాం ఎస్ఈ జి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ లిఫ్టు స్కీం ప్రాజెక్టు పనుల్లో భాగంగా మొదటి విడత చేపట్టనున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచెర్ల కాంప్లెక్స్, ఎస్సార్బీసీ, గాలేరు-నగరి కాల్వల విస్తరణ, గోరుకల్లు రిజర్వాయరు 55 కి.మీ. మేర విస్తరణ పనులకు ప్రభుత్వం రూ.1664 కోట్లతో టెండరు ప్రక్రియను ఖరారు చేసిందని తెలిపారు.
ఈ టెండరు డాక్యుమెంట్ను మొదట జుడీషియల్ ప్రివ్యూకు పంపినట్లు తెలిపారు. ఆమోదం పొందిన తర్వాత టెండరు ప్రక్రియ మొదలవుతుందని, రివర్స్ టెండరింగ్లో కాంట్రాక్టర్ను ఖరారుచేసి సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎస్ఈ శ్రీనివాసులు తెలిపారు. ఈ లిఫ్టు స్కీం వల్ల సీమకు కేటాయించిన నీటిని నిర్ణీత వ్యవధిలో విడుదల చేసి ఆయకట్టుకు అందించవచ్చని తెలిపారు. అలాగే తాగునీటి సమస్య తీరుతుందన్నారు. అదనంగా నీటి మళ్లింపు జరగదని ఎస్ఈ స్పష్టం చేశారు.