మూసీకి పోటెత్తిన వరద
ABN , First Publish Date - 2022-01-17T06:13:28+05:30 IST
తుఫాను ప్రభావంతో ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు వరద రాక పెరిగింది.
మూడు క్రస్టుగేట్ల ఎత్తివేత
6వేల క్యూసెక్కుల వరద విడుదల
కేతేపల్లి, జనవరి 16: తుఫాను ప్రభావంతో ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు వరద రాక పెరిగింది. దీంతో అధికారులు మూసీ ప్రాజెక్టు మూడు క్రస్టుగేట్లను ఆదివారం ఎత్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో నాగార్జునసాగర్గా పేరొందిన మూసీ ప్రాజెక్టుకు వానాకాలం సీజన్ నుంచి ఇన్ఫ్లో నిరంతరాయంగా కొనసాగుతోంది. యాసంగి సీజన్కు ఆయకట్టుకు గత డిసెంబరు 18 నుంచి 25 రోజుల పాటు సాగునీటిని విడుదల చేశారు. దీంతో 645 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉన్న ప్రాజెక్టులో అడుగు మేర మాత్రమే నీటిమట్టం తగ్గింది. ఈ క్రమంలో తుఫాను ప్రభావంతో ఎగువన వర్షాలు కురవడంతో ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. 645అడుగులు (4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం ఉన్న మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శనివారం రాత్రి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆదివారం నాటికి నీటిమట్టం 644.80అడుగులకు చేరడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు 3, 7, 10వ నెంబరు క్రస్టుగేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 6వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 4,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.