రేషన్ డీలర్ల సంక్షేమమే ధ్యేయం
ABN , First Publish Date - 2021-06-19T05:45:34+05:30 IST
రేషన్ డీలర్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రేషన్ డీలర్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రేషన్ డీలర్ల కమిషన్కు సంబంధించిన 3 కోట్ల 80 లక్షల 16 వేల రూపాయల చెక్కును ఉమ్మడి జిల్లా రేషన్ డీలర్ల సంఘాల జేఏసీకి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉందన్నారు. రేషన్ డీలర్లపై ముఖ్యమంత్రి కేసీర్కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. ఆధిపత్య పోరులేకుండా సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడడం మంచి పరిణామమని అభినందించారు. ప్రభుత్వానికి, డీలర్లకు మధ్య వారధిగా పనిచేస్తూ డీలర్ల సంక్షేమం కోసం కృషి చేయాలని జేఏసీకి సూచించారు. వారి వినతు లన్నింటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సీఎం అసెంబ్లీలోనే రేషన్డీలర్లను కొనియాడుతూ ప్రభుత్వానికి స్టేక్ హోల్డర్లుగా పరిగణించి, సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారన్నారు. కేంద్రం నిధులు విడుదల చేయకున్నా బకాయిలు 56 కోట్లను రేషన్ డీలర్లకు ఏకమొత్తంలో అందించిన విషయాన్ని గుర్తు చేశారు. డీలర్లు ప్రత్యేక శ్రద్ధతో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్, జిల్లా రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.