మహిళా వర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీ..! ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశం
ABN , First Publish Date - 2022-01-19T16:50:08+05:30 IST
కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...
హైదరాబాద్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, చర్చించారు. త్వరలోనే వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి మహిళా కాలేజీని తెలంగాణ తొలి మహిళా విశ్వ విద్యాలయంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయి ప్రతిపాదనలను సిద్దం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని చెప్పారు. ఆధునిక కోర్సులు రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి, యూజీసీ స్వయం ప్రతిపత్తితో, న్యాక్ గుర్తింపు కలిగిన ఈ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ప్రభుత్వం భావించిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళా యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేసే దిశగా పనులను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు విధి విధానాలు, అనుమతుల వివరాలు అందించాలని, విద్యాశాఖ అధికారులతో అంతర్గతంగా కమిటీ వేయాలని చెప్పారు. ప్రస్తుతం 4,159 మంది చదువుతున్నారని, యూనివర్సిటీగా మారిస్తే.. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఉన్నత విద్యలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తోందని, కొత్తగా ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీతో మరింత పేరు, ప్రఖ్యాతలు వస్తాయని చెప్పారు.
ఆన్లైన్లో డిగ్రీ క్లాసులు!
డిగ్రీ క్లాసులను ఆన్లైన్లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం కాలేజీ విద్యా శాఖ కమిషనర్ నవీన్మిట్టల్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజీలకు వర్తించనుంది. కరోనా దృష్ట్యా రాష్ట్రంలోని విద్యా సంస్థలకు 30 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవు రోజుల్లో ఆన్లైన్ క్లాసులను నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. కాగా, మంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైౖర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్చైర్మన్ వెంకటరమణ, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉమర్ జలీల్, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ర్టార్ లక్ష్మీనారాయణ, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విజులత పాల్గొన్నారు.