పీఠాల ఆక్రమణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2020-06-05T16:52:30+05:30 IST

తిరుమలలో మౌనస్వామి మఠం, విశాఖ శారద పీఠంకు కేటాయింపులకు మించి ఆక్రమించుకున్న..

పీఠాల ఆక్రమణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తిరుమలలో మౌనస్వామి మఠం, విశాఖ శారద పీఠంకు కేటాయింపులకు మించి ఆక్రమించుకున్న భూముల క్రమబద్దీకరణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు హిందూ మఠాలకు తిరుమలలో టీటీడీ లీజు ప్రతిపాదికన స్థలాలు కేటాయించింది. ఈ క్రమంలో మౌనస్వామి మఠానికి, విశాఖ శారద పీఠానికి కూడా భూములు కేటాయించారు. అక్కడ సంబంధిత మఠాలు భారీ భవంతులు నిర్మించుకున్నాయి. మౌనస్వామి మఠం నిర్వాహకులు 1870 చ.అ., విశాఖ శారద పీఠం నిర్వాహకులు 4,817చ.అ. చొప్పున అదనంగా ఆక్రమించారు.


గత డిసెంబర్ 28వ తేదీన తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. మౌనస్వామి మఠం ఆక్రమించిన భూమికి చ.అ. రూ. 374 చొప్పున, విశాఖ శారద పీఠం ఆక్రమించిన భూమికి చ.అ.964 చొప్పున లీజు నిర్ణయిస్తూ క్రమబద్దీకరించాలని పాలక మండలి నిర్ణయించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో గత జనవరి 21న లేఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రతిపాదనకు సర్కార్ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2020-06-05T16:52:30+05:30 IST