చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంటుంది... నా మాట రాసి పెట్టుకోండి: రాహుల్

ABN , First Publish Date - 2021-01-14T20:45:11+05:30 IST

దేశ భవిష్యత్తుకు తమిళనాడు సంస్కృతి, భాష, చరిత్ర ఎంతో అవసరమని, అందుకే తమిళనాడుకు వచ్చానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్

చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంటుంది... నా మాట రాసి పెట్టుకోండి: రాహుల్

చెన్నై : దేశ భవిష్యత్తుకు తమిళనాడు సంస్కృతి, భాష, చరిత్ర ఎంతో అవసరమని, అందుకే తమిళనాడుకు వచ్చానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తమిళ ప్రజలతో కఠినంగా వ్యవహరించి, వారి సంస్కృతిని పక్కన పెట్టేయగలమని భావించే వారికి ఓ సందేశం ఇవ్వడానికే వచ్చానని రాహుల్ చెప్పుకొచ్చారు. తమిళ సంస్కృతిని, చరిత్రను చూసిన తర్వాత చాలా ముచ్చటేసిందని, జల్లికట్టును ఓ పద్ధతి ప్రకారం చక్కగా నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందని ఆయన అన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అటు ఎద్దులు, ఇటు యువత క్షేమంగా ఉండే విధంగా, సురక్షిత పద్ధతిలో నిర్వహిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. తమిళ ప్రజలు తనపై అపార ఆదరాభిమానాలు చూయించారని, వారి సంస్కృతి, చరిత్ర రక్షించడం కనీస కర్తవ్యమని రాహుల్ తెలిపారు.


దీంతో పాటు వ్యవసాయ చట్టాలపై కూడా రాహుల్ స్పందించారు. ‘‘నా మాటను గుర్తుంచుకోండి. జాగ్రత్తగా వినండి. కచ్చితంగా ప్రభుత్వం ఉపసంహరించుకోక తప్పదు. నా మాట రాసి పెట్టుకోండి.’’ అని రాహుల్ అన్నారు. ఓ వైపు రైతులను తొక్కేస్తూ, మరోవైపు పారిశ్రామిక వేత్తలకు కేంద్రం సహాయం చేస్తోందని విమర్శించారు. కరోనా సమయంలోనూ కేంద్రం సాధారణ ప్రజానీకానికి చేసిందేమీ లేదని, మోదీ ఎవరి ప్రధాని మంత్రో చెప్పాలని నిలదీశారు. మోదీ కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల ప్రధాన మంత్రేనా? అని రాహుల్ సూటిగా ప్రశ్నించారు.


రైతులు ఈ దేశానికి వెన్నెముక లాంటివారని, వారిని అణచివేయాలని చూస్తే ఏం జరిగిందనేది చరిత్ర చూస్తే తెలుస్తుందని రాహుల్ చురకలంటించారు. దేశంలో రైతులు బలహీనపడ్డప్పుడల్లా దేశమూ బలహీనపడిందని ఆయన గుర్తు చేశారు. రైతులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల కోసం రైతులను నట్టేటా ముంచాలని చూస్తోందని ఆరోపించారు. రైతులకు సంబంధించిన రెండు, మూడింటిని కేంద్రం పారిశ్రామిక వేత్తలకు ఇవ్వాలని చూస్తోందని, దేశంలో ఇదే జరుగుతోందని రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. 

Updated Date - 2021-01-14T20:45:11+05:30 IST