పెళ్లయిన ఏడురోజులకే వరుడి దుర్మరణం
ABN , First Publish Date - 2021-12-02T08:58:01+05:30 IST
బయటి దేశంలో సాఫ్ట్వేర్ కొలువు చేసే ఆ యువకుడు, స్వదేశానికొచ్చాడు. తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడే స్థిరపడాలని అనుకున్నాడు.
డివైడర్ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం
పెంట్లవెల్లి, డిసెంబరు 1: బయటి దేశంలో సాఫ్ట్వేర్ కొలువు చేసే ఆ యువకుడు, స్వదేశానికొచ్చాడు. తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడే స్థిరపడాలని అనుకున్నాడు. వారం క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఆ సందడి కళకళలాడుతుండగానే రోడ్డు ప్రమాద బారిన పడి దుర్మరణం పాలయ్యాడు! నాగర్కర్నూలు జిల్లా పెంట్లపెల్లిలో ఈ విషాదం జరిగింది. గ్రామానికి చెందిన భాస్కర్-శశికళ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. విదేశాల్లో ఉద్యోగం చేసే పెద్ద కుమారుడు సాయిచరణ్ (27) ఇటీవలే సొంతూరుకొచ్చారు. 24న అదే జిల్లాకు చెందిన యువతితో ఆయనకు వివాహమైంది. మంగళవారం మహబూబ్నగర్లో కారుకుస సర్వీసింగ్ చేయించి.. ఆ వాహనంలో అదే రాత్రి సాయిచరణ్ తిరుగు ప్రయాణమయ్యారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి దగ్గర ఆయన కారు, డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయిచరణ్ అక్కడికక్కడే మృతిచెందారు. భర్త మృతదేహం వద్ద నవ వధువు భోరున విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.