జిల్లాలోనే అత్యధిక ‘చేయూత’ లబ్ధిదారులు
ABN , First Publish Date - 2020-08-13T11:26:47+05:30 IST
రాష్ట్రంలోనే మన జిల్లాలో అత్యధికమంది ‘చేయూత’లబ్ధిదారులు ఉన్నారని కలెక్టర్ డీ మురళీధర్రెడ్డి తెలిపారు.
కలెక్టర్ మురళీధర్రెడ్డి
కాకినాడ(డెయిరీపారమ్ సెంటర్), ఆగస్టు 12: రాష్ట్రంలోనే మన జిల్లాలో అత్యధికమంది ‘చేయూత’లబ్ధిదారులు ఉన్నారని కలెక్టర్ డీ మురళీధర్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ వివేకానంద హాల్ నుంచి కలెక్టర్తోపాటు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మొత్తం 2 లక్షల 26 వేల 482 మంది మహిళలకు మొదటి విడతగా రూ.18,750 చొప్పున రూ.424.65 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ కానుందని సీఎంకు వివరించారు. లబ్ధిదారులు వీడియో కాన్పరెన్స్ ద్వారా ముఖ్యమంత్రికి తమ స్పందనను తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వై హరిహరనాథ్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ఈడీలు జి సునీత, ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి, లబ్ధిదారులు పాల్గొన్నారు.