ఇంటినే బార్గా మార్చేశాడు..
ABN , First Publish Date - 2021-02-28T04:11:07+05:30 IST
ఇంటినే బార్గా మార్చేశాడు ఒకటి రెండు కాదు వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల మద్యం సీసాలను ఇంటి నిండా నింపేశాడు.
కర్ణాటక మద్యం భారీగా స్వాధీనం
స్కూటీలో తరలిస్తుండగా గుర్తింపు
నెల్లూరు(క్రైం) : ఫిబ్రవరి 27: ఇంటినే బార్గా మార్చేశాడు ఒకటి రెండు కాదు వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల మద్యం సీసాలను ఇంటి నిండా నింపేశాడు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యాన్ని తెప్పించి నెల్లూరులో అధిక రేట్లకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి సమాచారం మేరకు నగరంలోని సంతపేటలో ఉన్న మాగుంట నగర్ నివాసి వేనేటి పెంచలయ్య అదే ప్రాంతంలో ఉండే సతీష్ ద్వారా కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా మద్యాన్ని నెల్లూరుకు తెప్పించుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఎస్ఈబీ నెల్లూరు-1 ఇన్చార్జి సీఐ అశోక్కుమార్ ప్రత్యేక నిఘా ఉంచాడు. శనివారం పెంచలయ్య స్కూటీలో వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నాడు. స్కూటీని పరిశీలించగా అందులో కర్ణాటకకు చెందిన 96 క్వార్టర్ సిల్వర్ చీప్ మద్యం సీసాలను గుర్తించారు. అనంతరం అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా పోలీసులు నివ్వెర పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెంచలయ్య ఇంటిలో సోదాలు చేయగా మరో 279 సిల్వర్ చీప్ సీసాలు, 9 లీటర్ల వోల్డ్అడ్మిరల్ ఇలా మొత్తం 984 సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సతీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తనిఖీల్లో ఎస్ఐలు ఎం. కృష్ణారావు, ఎమ్ఎస్ రవీంద్ర పాల్గొన్నారు.